తిరుపతి పార్లమెంటు నియోజకవర్గానికి గత నెలలో జరిగిన ఉప ఎన్నికకు సంబంధించిన ఫలితాలు నిన్న వెలువడిన విషయం తెలిసిందే.కాగా ఈ ఉప ఎన్నికలో అధికార వైసీపీ తరపున బరిలో నిలిచిన డాక్టర్ గురుమూర్తి ఘనవిజయం సాధించారు.
ప్రధాన ప్రతిపక్షం టీడీపీ నుంచి బరిలో ఉన్న కేంద్ర మాజీమంత్రి పనబాక లక్ష్మిపై ఆయన గెలుపొందారు.అయితే ఈ ఉప ఎన్నికల ఫలితాలపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ మంత్రి అచ్చెన్నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు.
ఇప్పటికే పలు విషయాలపై టీడీపీ నేతల మధ్య వైసీపీ శ్రేణుల మధ్య తీవ్ర మాటల యుద్ధం కొనసాగుతున్న విషయం తెలిసిందే.ఈ క్రమంలో ఒకరిపై ఒకరు తీవ్ర ఆరోపణలు చేసుకుంటూ విమర్శించుకుంటున్నారు.
ఈ క్రమంలో మరో సారి అచ్చెన్నాయుడు ఈ ఉప ఎన్నికలో వైసీపీ దొంగ ఓట్లు, దొంగ నోట్లతో ప్రజలను ప్రలోభ పెట్టి విజయం సాధించిందని విమర్శించారు.
ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసి, ఓటర్ల హక్కును కాలరాసి తెచ్చుకున్నది నిజమైన విజయమే కాదని మండిపడ్డారు.
కాగా ఈ ఎన్నికల్లో వైసీపీ గెలిచినా నైతికంగా టీడీపీనే గెలిచిందని ప్రజలు ముచ్చటించుకుంటున్నారని తెలిపారు.ఒకవేళ మీరే గనుక దొంగ ఓట్లతో కాకుండా, న్యాయబద్ధంగా గెలిచినట్లుగా భావిస్తే బహిరంగ ప్రమాణానికి రావాలని సవాల్ విసిరారు.