ఎన్టీఆర్ కుమారుడు, హీరో నందమూరి హరికృష్ణ రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు.నల్లగొండ జిల్లా అన్నేపర్తి వద్ద ఈ రోడ్డు ప్రమాదం జరిగింది.
కారు అదుపుతప్పి బోల్తా పడటంతో తలకు తీవ్రగాయాలయ్యాయి.చికిత్స నిమిత్తం నార్కెట్పల్లి కామినేని ఆస్పత్రికి తరలించారు.
పరిస్థితి విషమించడంతో మృతిచెందారు.మరో నాలుగు రోజుల్లో (సెప్టెంబర్ 2) తన పుట్టిన రోజును జరుపుకోనున్న హరికృష్ణ ఇలా అర్థాంతరంగా మృతిచెందటంతో నందమూరి కుటుంబం శోక సంద్రంలో మునిగిపోయింది.
ఈ రోజు ఆయన అంతిమ యాత్ర జరగనుంది.
ఈ నేపథ్యంలో అతివేగమే ఆయన మరణానికి కారణమని అర్ధమయ్యింది.వాస్తవానికి ఆయన డ్రైవర్ ని ఎందుకు పెట్టుకోలేదు అనే అనుమానాలు కూడా చాలామందికి వచ్చాయి.అయితే తనకు ఓ మంచి డ్రైవర్ కావాలని హరికృష్ణ 15 రోజుల కిందట బోధన్కు చెందిన టీడీపీ సీనియర్ నేత ఎం.అమర్నాథ్బాబుకు చెప్పారు.తనకు తెలిసిన ఒక యువకుడిని ఆయన పంపించారు.
అతని బయోడేటాను తీసుకున్న హరికృష్ణ, మళ్లీ పిలిపిస్తానని చెప్పి పంపించారు.ఆ యువకుడి జన్మ నక్షత్రం, జాతకం పరిశీలించిన హరికృష్ణ, ఆయన జాతకరీత్యా స్థిరత్వం ఉండదని భావించారు.
ఆ యువకుడిని మరోసారి పిలిపించారు.ప్రతి రోజు తనను ఇంటి వద్ద దింపాక హోటల్లోనే పడుకోవాలని, హైవేపై వంద కిలో మీటర్లు, సిటీలో 80 కిలో మీటర్లలోపు వేగంతోనే వెళ్లాలని చెప్పారు.
ఈ షరతులకు లోబడి ఉంటానంటే డ్యూటీలో చేరాలని సూచించారు.ఆ యువకుడికి ఈ షరతులు నచ్చకపోవడంతో మళ్లీ రాలేదు.
బహుశా అతను వచ్చి ఉంటే ప్రమాదం జరిగి ఉండేది కాదేమోనని అమర్నాథ్ అభిప్రాయపడ్డారు.