తెలుగుదేశం పార్టీ అంటే కార్యకర్తలకు, నాయకులకు కొదవే లేదు.పార్టీ పుట్టినప్పటి నుంచి ఆ పార్టీ కోసం అహర్నిశలు కష్టపడినవారు చాలామందే ఉన్నారు.
పార్టీ అధికారంలో ఉండగా వీరందరికి దానికి అనుగుణంగానే అనేక రకాలుగా రాజకీయ లబ్ది చేకూరింది.ప్రస్తుతం ఏపీలో టీడీపీ ప్రతిపక్షంలో ఉంది.
అధికార పార్టీ బలం, బలగం ముందు తాము ఎదురు నిలబడలేమనే అభిప్రాయం వారిలో వచ్చేసింది.అందుకే టీడీపీ తరపున గొంతెత్తి మాట్లాడేందుకు చాలామంది నాయకులూ జంకుతున్నట్టుగా కనిపిస్తోంది.
ముఖ్యంగా పార్టీ మాది, నాయకుడు మావాడు, అంటూ గొప్పలు చెప్పుకున్న ఓ ప్రధాన సామాజికవర్గం నాయకులు ఇప్పుడు బాగా సైలెంట్ అయిపోయారు.పార్టీ మీద అధికార పార్టీ నాయకులు ఎన్ని విమర్శలు చేస్తున్నా వీరు మాత్రం నోరు ఎత్తేందుకు జంకుతున్నారు.
తాము అధికార పార్టీ మీద గట్టిగా గొంతెత్తితే ఎక్కడ అనవసర కేసుల్లో ఇరుక్కుంటామో అన్న ఆందోళన కూడా సదరు నాయకుల్లో కనిపిస్తోంది.
గత టీడీపీ ప్రభుత్వంలో చక్రం తిప్పిన నాయకులు తమకు కావాల్సిన అన్ని రకాల పనులు చక చక చేయించుకున్నారు.కేబినెట్లో మంత్రి పదవుల నుంచి చంద్రబాబు సలహాలు ఇచ్చే వరకు మొత్తం వ్యవహారాలన్నీ ఆ సామాజిక వర్గానికి చెందిన నాయకులే చక్కబెట్టారు.ముఖ్యంగా కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఈ సామాజిక వర్గం హవా బాగా ఎక్కువగా కనిపించింది.
చంద్రబాబు ఆదేశాలను కూడా ఒక దశలో పక్కన పెట్టి పూర్తిగా తమ ఎజెండానే అమలు చేసిన సదరు నాయకులు ఆయా నియోజకవర్గాల్లో బలమైన శక్తిగా మారి మరో నేతను ఎదగకుండా చేశారు.పార్టీని ఈ రేంజ్ లో వాడుకుని పదవులు, ఆస్తులు బాగా వెనకేసుకున్నారు.
ప్రస్తుతం పార్టీ ప్రతిపక్షంలో ఉండడంతో పార్టీని తిరిగి బలోపేతం చేసేందుకు, క్యాడర్ లో ధైర్యం నింపేందుకు ఏ మాత్రం సిద్ధం అవుతున్నట్టు కనిపించడంలేదు.అధికార పక్షం దూకుడు ప్రదర్శిస్తూ విపక్షం టీడీపీ పై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేస్తున్నా వాటిని ఖండించేందుకు, కౌంటర్లు ఇచ్చేందుకు ఆ సామజిక వర్గానికి చెందిన నాయకులు ఏ ఒక్కరైనా బయటకు రాకపోవడం అధినేత చంద్రబాబు ని ఆలోచనలో పడేసిందట.
ఎంత చేసినా ఇంతేనా అంటూ బాబు నాయకుల తీరుపై ఆవేదనగా ఉన్నాడట.గుంటూరులో అన్నీ తానై చక్రం తిప్పిన యరపతినేని శ్రీనివాసరావు కానీ, వినుకొండ నుంచి వరుస విజయాలు సాధించి ప్రస్తుత ఎన్నికల్లో ఓటమి చెందిన జీవీ ఆంజనేయులు, పొన్నూరు నుంచి ఐదుసార్లు గెలిచి ఓడిన ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ , చిలకలూరిపేట నుంచి ఓడిన మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు , పశ్చిమ గోదావరిలో వివాదాస్పద నేతగా గుర్తింపు పొందిన చింతమనేని ప్రభాకర్, ఏలూరు ఎంపీగా ఓడిన మాగంటి బాబు ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది నాయకులు ఇప్పుడు బయటకి వచ్చేందుకు జంకుతూనే ఉన్నట్టు కనిపిస్తోంది.