ఏపీలో అధికారం దక్కకుండా చేసి తాము అధికారంలోకి రావాలని చూస్తున్నాడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్.గత ఎన్నికల్లో అధికారం దక్కుతుంది అనే ధీమా ఎక్కువ అవ్వడంతో కొన్ని కొన్ని లోపాలను సరిచేసుకోకుండా ముందుకు వెళ్లి బోర్లా పడ్డాడు.
అందుకే ఇప్పుడు అన్నిరకాల ముందస్తు జాగ్రత్తలు తీసుకుని అడుగులు వేస్తున్నాడు జగన్.అందుకే తమ పార్టీకి రాజకీయ వ్యూహాలు నేర్పేందుకు బీహార్ కి చెందిన ప్రశాంత్ కిషోర్ అనే మేధావిని ఏర్పాటు చేసుకున్నాడు జగన్.
పార్టీలో పెత్తనం అంతా ప్రశాంత్ కిషోర్ చేతిలోనే పెట్టేసారు.ఈ ఎన్నికల్లో ఎత్తులు పై ఎత్తులు సర్వేలు, అభ్యర్థుల ఎంపిక తదితర అంశాలన్నీ పీకే నే చూస్తున్నాడు.
అందుకోసం సొంతంగా తన బీహార్ బ్యాచ్ లను ఏపీ మొత్తం మొహారించాడు.
పీకే ఆదేశాల ప్రకారం టీడీపీకి చెందిన కీలకమైన నియోజకవర్గాల్లో ఆ అభ్యర్థులను ఓడించేందుకు సర్వే రిపోర్టులు తీసుకుని కులాల వారీగా ఎక్కడెక్కడ లోటు ఉంది ? ఎక్కడెక్కడ టీడీపీ నాయకులను వైసీపీలో చేర్చుకోవాలి ? దానికి ఎంత బడ్జెట్ అవసరం అనే విషయాలను క్షుణ్ణంగా పరిశీలించేందుకు ప్రత్యేకంగా కొన్ని టీమ్స్ ని పంపినట్టు సమాచారం.ముఖ్యంగా ఏపీ సీఎం చంద్రబాబు తనయుడు నారా లోకేష్ పోటీ చేస్తున్న మంగళగిరి నియోజకవర్గంలో ఓ ప్రత్యేకమైన డ్రెస్ కోడ్తో హైదరాబాద్ నుంచి అద్దె కార్లలో నలభై నుంచి యాభై మంది వరకు బ్యాచ్ దిగారు.తమ దగ్గర ఉన్న సర్వే రిపోర్టులు , ఎవరెవరిని కలవాలి వారిని ఎలా ప్రలోభ పెట్టాలి ? అనే అంశాలను ప్రత్యేకంగా నమోదు చేసుకుని వచ్చినట్టు తెలుస్తోంది.
ఈ విషయం పసిగట్టిన టీడీపీ నాయకులు ఆ బృందంలోని కొంతమంది వ్యక్తులను పట్టుకుని పోలీసులకు అప్పగించినట్టు తెలుస్తోంది.తాము సర్వే కోసం వచ్చామని చెబుతున్నప్పటికీ వారి వద్ద సర్వేకు సంబంధించిన ఆధారలకంటే టీడీపీ నేతలకు సంబందించిన వివరాలే ఎక్కువగా ఉండటంతో పోలీసులు విచారణ మొదలుపెట్టారట.తాము ఐ ప్యాక్ టీం సభ్యులమని వారు ప్రాథమికంగా పోలీసులకు చెప్పినట్లు తెలుస్తోంది.మంగళగిరిలో లోకేష్ ను ఎట్టిపరిస్థితుల్లో అయినా ఓడించాలనే ఆలోచనతో వైసీపీ ఈ ఎత్తుగడలకు పాల్పడుతున్నట్టు అర్ధం అవుతోంది.
కాకపోతే ఇటువంటి బ్యాచ్ లు ఏపీలో అన్ని నియోజకవర్గాల్లో పాగా వేసినట్టు టీడీపీ అనుమానిస్తోంది.