టీడీపీ కి కంచుకోటలా ఉన్న గోదావరి జిల్లాల్లో ఒకటైన పశ్చిమ గోదావరి జిల్లా లో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి.ఈ జిల్లాలో ఉన్న అన్ని స్థానాల్లో టీడీపీ క్లిన్ స్వీప్ చేసేసింది.
తాడేపల్లిగూడెంలో టీడీపీ – బీజేపీ పొత్తులో భాగంగా అక్కడ బీజేపీ గెలిచింది.ప్రస్తుతం ఈ జిల్లాలో టీడీపీ కంచుకోటకు బీటలు వారే ప్రమాదం ఉండడంతో …టీడీపీ అధినాయకత్వం ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటోంది.
ఎలా అయినా ఈ కంచుకోటకు బీటలు వారకుండా జాగ్రత్తలు తీసుకునే పనిలో పడింది.దీంతో మెజారీటీ స్థానాల్లో సిట్టింగ్ లను మార్చి క్లిన్ ఇమేజ్ ఉన్న వారిని ఎంపిక చేయాలని చూస్తోంది.
ఇప్పటికే ఆ ప్రయత్నాల దిశగా అడుగులు వేస్తోంది.దీనిలో భాగంగానే… ప్రస్తుత సిట్టింగ్ల జాతకాలు కొన్నింటిని త్వరలోనే మార్చాలని చూస్తోంది.
ఈ జిల్లాల్లో సుమారు ఆరుగురు సిట్టింగ్ల స్థానాల్లో మార్పులు, చేర్పులు ఉంటాయని పార్టీలో ఊహాగానాలు మొదలయ్యాయి.ఈసారి కూడా ప్రజా మద్దతుతో అధికార పగ్గాలు చేజారిపోకుండా కాపాడుకునేందుకు క్షేత్రస్థాయిలో పట్టు చేజారకుండా ముందుకు వెళ్లాలని టీడీపీ భావిస్తోంది.ఐవీఆర్ఎస్ ద్వారా దఫాల వారీగా, నియోజకవర్గాల్లో నిర్వహించిన అభిప్రాయ సేకరణ నివేదికలు అధిష్ఠానం వద్ద సిద్ధంగా ఉన్నాయి.వీటిని పరిగణనలోకి తీసుకుని తమకు కొత్తగా దరఖాస్తు చేసుకుని, ఆర్థికంగా, సామాజికంగా బలంగా ఉన్న వారి వివరాలను పరిశీలించి త్వరలోనే మరోసారి అభిప్రాయ సేకరణకు దిగబోతుంది.
దాదాపు సగానికి సగం స్థానాలను త్వరలోనే ప్రకటించేందుకు సిద్ధమవుతుంది.సీనియర్లు, వరుస విజయాలను అందుకున్న వారికి ఈ జాబితాలో చోటు దక్కే అవకాశం కనిపిస్తోంది.
టీడీపీ ప్రకటించబోయే అభ్యర్థుల వివరాలు బయటకి రాగానే తాము కూడా అందుకు తగ్గ బలమైన నేతలను రంగంలోకి దించాలని వైసీపీ కూడా భావిస్తోంది.అందుకే ఆయా నియోజకవర్గాల్లో బలహీనంగా ఉన్న నియోజకవర్గ ఇంచార్జిలను ఎటువంటి మొహమాటం లేకుండా మార్చి ముందుకు వెళ్లాలని వైసీపీ ఆలోచన.ఇప్పటికే అసెంబ్లీ నియోజకవర్గాలకు కన్వీనర్లను నియమించారు.వీరే రాబోయే ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులుగా ఉండబోతున్నారని అంతా అనుకున్నారు.కానీ కొన్ని నియోజకవర్గాలకు సంబంధించి ఆఖరు క్షణంలో మార్పులు, చేర్పులు జరిగే అవకాశాలు కనిపిస్తుండడంతో ప్రస్తుత కన్వీనర్లను ఆందోళనకు గురిచేస్తోంది.మరోవైపు డెల్టా, మెట్ట ప్రాంతంలోనూ పార్టీ విజయం సాధించాలంటే కొన్ని చోట్ల మార్పులు, చేర్పులు చేయాల్సిందేననే ఒత్తిడి వైసీపీ పై బాగా పెరిగింది.
ఇక టీడీపీ – వైసీపీ రెండు పార్టీలు కూడా ఈ గోదావరి జిల్లాను కంచుకోటగా మార్చుకుని తమ రాజకీయ భవిష్యత్తు మార్చుకోవాలని చూస్తున్నాయి.