ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నీ దెబ్బతీయడానికి టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు.దీనిలో భాగంగానే కాంగ్రెస్ పార్టీతో జాతీయ స్థాయిలో సఖ్యతగా ఉంటూ… ఏపీలో మాత్రం పొత్తు లేకుండా చూసుకుంటున్నాడు.
అసలు కాంగ్రెస్ టీడీపీ రెండు పార్టీలు కలిసి ఎన్నికలకు వెళ్తాయని అంతా భావించారు.ఈ మేరకు రెండు పార్టీలు కూడా అందుకు దాదాపు సిద్ధం అయిపోయాయి.అయితే… తెలంగాణ లో ఈ రెండు పార్టీలతో పాటు మరికొన్ని పార్టీలు కలిసి ఎన్నికలకు వెళ్లడం….అక్కడ చేదు అనుభవం ఎదురవడంతో… ఏపీలో కలిసి ముందుకు వెళ్ళాలి అన్న ఆలోచన విరమించుకున్నారు.
కాకపోతే అంతర్గతంగా పొత్తు మాత్రం కొనసాగిస్తున్నారు.దీనిలో భాగంగానే… కాంగ్రెస్ లో బలమైన నాయకులుగా ఉన్న కొంతమందిని టిడిపిలో చేర్పించి వైసిపి ఓట్లకు గండి కొట్టించాలని చూస్తున్నారు.
కరడు కట్టిన కాంగ్రెస్ వాదులుగా పేరుపడ్డ కాంగ్రెస్ సీనియర్లు సైతం పార్టీని వీడుతున్నారంటే ఇందులో అనుమానం కలగడం సహజమే.సుదీర్ఘకాలం కాంగ్రెస్ పార్టీయే జీవితంగా భావించిన కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డి, కిశోర్ చంద్రదేవ్ వంటి నేతలు పార్టీని వీడటం రాహుల్, చంద్రబాబు ప్లాన్ లో భాగమే అనే చర్చ మొదలయ్యింది.ఈ ఎపిసోడ్ లో కాంగ్రెస్ – టీడీపీ ప్రధాన లక్ష్యం మాత్రం వైసీపీ ఓట్లకు గండి కొట్టించడమే.ఇప్పుడు ఒక్కో బలమైన నేత టీడీపీలో చేరిపోతున్నారు.మిగతా నాయకులు పోటీలో నిలిచినా… వైసీపీకి వెళ్లే ఓట్లకే గండి పడతాయని ఈ రెండు పార్టీలు అంచనా వేస్తున్నాయి.ఇదే విషయాన్ని ముందే పసిగట్టిన వైసీపీ అధినేత జగన్ కూడా ఇదే విషయంపై అనేకసార్లు ప్రస్తావించి విమర్శలు చేశారు.
కాంగ్రెస్ సీనియర్ నేతలు, అధికారంలో పదవులను అనుభవించిన లీడర్లే కాంగ్రెస్ కు ఇప్పుడు రామ్ రామ్ చెప్పి టీడీపీలో చేరబోతున్నాము అంటూ బహిరంగంగా చెప్పడం చర్చనీయాంశం అవుతోంది.ముఖ్యంగా ఎంపీ స్థానాలకు పోటీ చేసే అభ్యర్థులే కాంగ్రెస్ ను వీడి తెలుగుదేశం పార్టీలో చేరుతుండటం మరింత సందేహం కలిగిస్తోంది.అయితే ఇలా సీనియర్ నాయకులే పార్టీలో చేరడం వెనుక బాబు రాజకీయం ఎవరికీ అర్ధం కావడంలేదు.వాస్తవంగా అయితే… జాతీయ స్థాయిలో సత్సంబంధాలున్నప్పుడు ఒక పార్టీ నేతలను చేర్చుకోవడానికి సహజంగా ఆలోచిస్తారు.
కానీ చంద్రబాబు ఏమాత్రం ఆలోచించకుండా కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి, కిశోర్ చంద్రదేవ్ ను పార్టీలోకి ఆహ్వానించారంటే ఇందులో రాహుల్ ప్రమేయం కూడా ఉందన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.