మూడు రోజుల పాటు జరిగిన అసెంబ్లీ ప్రత్యేక సమావేశాల్లో ఇరు పక్షాల మధ్య చర్చ వాడీ వేడి గా సాగిన సంగతి తెలిసిందే.అయితే ఈ రోజు జరిగిన సమావేశంలో సీఎం జగన్ టీడీపీ నేతలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
అసెంబ్లీ లో స్పీకర్,అధికార పార్టీ సభ్యులు అప్రజాస్వామికంగా సభను నిర్వహిస్తున్నారు అని పేర్కొంటూ టీడీపీ నేతలు గవర్నర్ కు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తుంది.సంప్రదాయం, నిబంధనలను ఉల్లంఘిస్తున్నారని,పక్షపాత ధోరణితో, ఇష్టానుసారంగా సభను నిర్వహిస్తున్నారు అంటూ ఫిర్యాదు లో పేర్కొన్నట్లు తెలుస్తుంది.
ప్రతిపక్ష సభ్యులను దూషించడం, బెదిరించడంతో పాటు చేయి చేసుకుంటున్నారని గవర్నర్కు ఇచ్చిన ఫిర్యాదులో టీడీపీ నేతలు పేర్కొన్నారు.అయితే అసెంబ్లీ లో ఇంత జరుగుతున్నా స్పీకర్ మౌనం వహిస్తూ ప్రేక్షకపాత్ర పోషిస్తున్నారని అన్నారు.
అధికార బలంలో ప్రభుత్వం తమను బెదిరింపులకు గురిచేస్తోందన్నారు.స్వయంగా ముఖ్యమంత్రే తన పార్టీకి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలను తమపై దాడి చేసేందుకు ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు.
అసెంబ్లీలో అధికార పార్టీ అరాచక చర్యలు ప్రజలకు తెలియకుండా ఉండేందుకు లైవ్ ప్రసారాలు కూడా నిలిపివేస్తున్నారని వారు ఆరోపించారు.ఈ రోజు జరిగిన సమావేశంలో ఏపీ సీఎం టీడీపీ నేతలను మీరు ఎమ్మెల్యేలా లేదంటే రౌడీలా అని సంబోధిస్తూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
బోర్డర్ దాటితే మార్షల్స్ చేత బయటకు గెంటేయాలి అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.ఈ క్రమంలో టీడీపీ నేతలు గవర్నర్ కు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తుంది.