ఎక్కడ ఎప్పుడు ఏ విధంగా ఎత్తులు వేయాలో టీడీపీ అధినేత చంద్రబాబుకు బాగా తెలుసు.పార్టీ పరిస్థితి ఇప్పుడు ఇబ్బందికరంగా ఉన్నా, చంద్రబాబు కంగారు పడటం లేదు.
ఏదో రకంగా పార్టీని తిరిగి గట్టెక్కించగలను అనే నమ్మకంతో ఉన్నారు.అయితే అదంతా బీజేపీతో పొత్తు పెట్టుకుంటే సాధ్యమవుతుందని చంద్రబాబు భావిస్తున్నారు.
ఎంతగా ప్రయత్నించినా, బీజేపీ నుంచి సానుకూలత రాకపోవడం, తమను అణగదొక్కేందుకు బీజేపీ ఏపీ నేతలు ప్రయత్నిస్తూ ఉండటం వంటి పరిణామాలు కాస్త ఆందోళన కలిగిస్తున్నా, తప్పనిసరిగా బీజేపీ తమతో పొత్తు పెట్టుకుంటుందనే అభిప్రాయంలోనే బాబు ఉంటూ వస్తున్నారు.
వీలైనప్పుడల్లా కేంద్ర బీజేపీ పెద్దలను పొగుడుతూ, వారికి దగ్గరయ్యేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నా, వారెవరూ పట్టించుకోనట్టు వ్యవహరిస్తున్నారు.
ఇప్పటికే తనకు పరిచయం ఉన్న ఆర్ఎస్ఎస్ నేతలతోనూ పొత్తు విషయమై బీజేపీని ఒప్పించాలి అని కోరినా, ఎటువంటి రెస్పాన్స్ రావడం లేదు.ఈ క్రమంలో తిరుపతి పార్లమెంట్ స్థానానికి ఉప ఎన్నికలు త్వరలోనే రాబోతున్నాయి.
ఇక్కడ వైసీపీ ఎంపీగా గెలిచిన బల్లి దుర్గాప్రసాద్ ఇటీవల అనారోగ్యంతో మరణించడంతో, ఇక్కడ ఎన్నికలు అనివార్యమయ్యాయి.అయితే మరణించిన ప్రజాప్రతినిధి కుటుంబంలో ఒకరికి ఆ పదవి ఏకగ్రీవం అయ్యేలా చేయడం ఏపీలో ఆనవాయతీగా వస్తోంది.
గతంలో టీడీపీ విషయంలోనూ, వైసీపీ ఇదేవిధంగా వ్యవహరించింది.దీంతో ఇప్పుడు తిరుపతి ఉప ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిని దింపే ఆలోచనలేదు.
దీనికితోడు ప్రజల్లో తమపై ఇంకా సానుకూలత ఏర్పడలేదనే అభిప్రాయం సైతం ఉండడంతో, పోటీకి దూరంగా ఉండాలని బాబు నిర్ణయించుకున్నారు.కాకపోతే ఇక్కడి నుంచి బీజేపీ పోటీ చేసేందుకు ఉత్సాహం చూపిస్తుండడంతో బీజేపీకి పరోక్షంగా ఆయన మద్దతు ఇవ్వాలని, ఇక్కడ బీజేపీ ఎంపీ అభ్యర్థిని గెలిపించి కేంద్ర బీజేపీ పెద్దలకు దగ్గరవ్వాలనే విధంగా చంద్రబాబు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
అలా చేస్తేనే బీజేపీ పెద్దలు టీడీపీ తో పొత్తు విషయమై ఆలోచిస్తారని చంద్రబాబు ప్లాన్ గా ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది.ఇప్పుడున్న పరిస్థితుల్లో బాబు ప్రత్యక్ష, పరోక్ష సహకారం బీజేపీ తీసుకునేందుకు ఇష్టపడుతుందా లేదా అనే విషయంపై భవిష్యత్తులో టీడీపీ బీజేపీ పొత్తుల వ్యవహారం ఆధారపడి ఉంటుంది.