వరుస ఎదురు దెబ్బలతో ఇప్పటికే తీవ్ర నిరాశ, నిస్పృహల్లో కూరుకుపోయిన తెలుగుదేశం పార్టీ ఇప్పుడిప్పుడే కాస్తో కూస్తో ఉపశమనం పొందుతున్నట్టుగా కనిపిస్తోంది.బిజెపి, జనసేన పార్టీ లు వైసీపీ పై దండయాత్ర మొదలు పెట్టడంతో, టీడీపీ కూడా దానికి గొంతు కలిపి వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు మొదలు పెట్టింది.
ఇది ఇలా ఉంటే పార్టీకి చెందిన కీలక నాయకులు ఇప్పుడు వైసీపీలో చేరే విషయంపై దృష్టి పెట్టడంతో, టీడీపీలో ఆందోళన మొదలైంది.వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత, టీడీపీకి చెందిన కొంతమంది ఎమ్మెల్యేలు వైసీపీలో చేరకుండానే, ఆ పార్టీకి అనుబంధ సభ్యులుగా కొనసాగుతున్నారు.
ఇప్పటికే వల్లభనేని వంశీ, కరణం బలరాం వంటి వారితో పాటు, జనసేన పార్టీకి చెందిన రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు వైసీపీ వైపు నిలబడ్డారు.ఒకవేళ వీరంతా వైసీపీలో అధికారికంగా చేరినా, రాజీనామా చేయాలనే కండిషన్ జగన్ పెట్టడంతో, వారు బయట నుంచి ఆ పార్టీకి మద్దతు ఇస్తున్నారు.
ఇదిలా ఉంటే విశాఖ జిల్లాకు చెందిన మరో టీడీపీ ఎమ్మెల్యే వైసీపీలోకి చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు.ఈ మేరకు నేడు జగన్ ను కలిసి భవిష్యత్ కార్యాచరణపై చర్చించబోపోతున్నారు.
ఈ పరిణామాలన్నీ తెలుగుదేశం పార్టీలో కంగారు పుట్టిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో పార్టీ నుంచి ఎంత మంది నాయకులు వైసీపీలో చేరే అవకాశం ఉంది అనే విషయంపై టీడీపీ దృష్టి పెట్టింది.ఇప్పటికే పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన టీడీపీ ఎమ్మెల్యే వైసీపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారనే సమాచారం టీడీపీ వద్ద ఉంది.వీరు కాకుండా కొంతమంది ఎంపీలు సైతం టీడీపీని వీడి, బిజెపి వైపు వెళ్లేందుకు చేస్తున్నట్లుగా ఇప్పుడిప్పుడే చంద్రబాబుకు సమాచారం అందుతోంది.
టీడీపీ నుంచి బీజేపీలో చేరిన రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి ద్వారా, వీరంతా బీజేపీలోకి వెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది.వీరే కాకుండా టీడీపీకి చెందిన ముగ్గురు నలుగురు ఎమ్మెల్యేలు వైసీపీలో చేరాలని చూస్తున్నారు.
ఒకవేళ తమ పదవులకు రాజీనామా చేసిన వైసిపి తరఫు నుంచి పోటీ చేసేందుకు కూడా వేరు సిద్ధంగా ఉన్నారు.ఈ నేపథ్యంలో జగన్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.కాకపోతే వారిని నేరుగా పార్టీ లో చేర్చుకోకుండా బయట నుంచి మద్దతు తీసుకుంటే ఎలా ఉంటుంది అనే విషయం పై జగన్ దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.అలా అయితే ఎన్నికలకు వెళ్లాల్సిన అవసరం కూడా ఉండదు అనేది జగన్ ప్లాన్.
ఈ పరిస్థితుల్లో టిడిపి రాజకీయ భవిష్యత్తు పై అనుమానం ఉన్న కొంతమంది ఎమ్మెల్యేలు పార్టీ మారే విషయమై వైసీపీ కీలక నాయకులతో మంతనాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.ఇప్పుడు వలసలు కనుక మొదలయితే టీడీపీ కోలుకోలేని విధంగా దెబ్బతినడం ఖాయం.