అవసరం ఎంత పనైనా చేయిస్తుంది.మనం వద్దనుకుని దూరం చేసుకున్నవారే ఒక్కోసారి మనకు దిక్కవుతూ ఉంటారు.
వారే ఆపద్బాంధవులుగా మనల్ని కష్టాల నుంచి బయటపడేస్తుంటారు.ఇప్పుడు టీడీపీ అధినేత చంద్రబాబు కి కూడా ఆ విధంగానే పాత స్నేహితుల అవసరం వచ్చిపడింది.
తనను కష్టాల నుంచు వారు మాత్రమే బయటపడేస్తారనే నమ్మకం ఆయనలో ఎక్కువయ్యింది.అందుకే పది, ఇరవై సంత్సరాల క్రితం స్నేహాలను కూడా ఇప్పుడు గుర్తు చేస్తూ వారిని కలిసి తన బాధల నుంచి ఓదార్పు కోరుకుంటున్నాడు.
చంద్రబాబు స్నేహితులు కూడా ఆషామాషీ వ్యక్తులేమి కాదు.రాష్ట్ర, జాతీయ రాజకీయాలను ప్రభావితం చేసే స్థాయి కలిగిన వారు.
ప్రస్తుత ఏపీలో టీడీపీ ఒంటరి పోరాటం చేస్తోంది.శత్రువుల సంఖ్య కూడా ఎక్కువగా ఉంది.
కేంద్రంలో బిజెపీతోనూ సున్నం పెట్టుకుంది.ఇక ఏపీలో తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ చవిచూడని పరాజయాన్ని కూడా చూసేసింది.175 స్థానాల్లో పోటీ చేస్తే కేవలం 23 స్థానాలు రావడం ఇప్పటికీ టీడీపీ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నాయి.అయినా ఉనికి చాటుకునేందుకు బాబు తాపత్రయపడుతున్నాడు.
ప్రస్తుతం జగన్ ప్రభుత్వం దూకుడు మీద ఉండడంతో టీడీపీ శాసనసభ్యుల్లో కంగారు పుడుతోంది.అందుకే అర్జంటుగా వైసీపీ కానీ, బీజేపీ లోకి కానీ జంప్ చేసి తీరాల్సిందే అన్న ఆలోచనతో ఇతర పార్టీలతో మంతనాలు చేస్తున్నారు.బీజేపీ కూడా టీడీపీని టార్గెట్ చేస్తూ టీడీపీని అడ్రెస్ లేకుండా చేయడమే లక్ష్యంగా ముందుకు వెళుతోంది.దీంతో వీరిలో భరోసా కల్పించడం, పార్టీకి పునర్వైభవం తీసుకురావడం ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నాడు బాబు.
అందుకే బీజేపీకి దగ్గరయ్యేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు.ఈ క్రమంలోనే ఆయన పాత విషయాలను పక్కన పెట్టి కొత్తగా పరిచయాలు పెంచుకునేందుకు, తనను తాను ఆవిష్కరించుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు.
ఈ క్రమంలో ఆర్ ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ని బాబు కలిసి తన బాధను చెప్పుకున్నట్టు తెలుస్తోంది.బీజేపీకి దగ్గరయ్యేలా, వైసీపీని ఇరుకున పెట్టేలా మీరే చేయాలి అంటూ ఆయనకు మొరపెట్టుకున్నాడట బాబు.
మోహన్ భగవత్ తో చంద్రబాబుకి మంచి సంబంధాలే ఉన్నాయి.గతంలోనూ వీరిద్దరూ అనేక వేదికలపై కలిశారు.ఇక, అదే సమయంలో తెలంగాణ సీఎం కేసీఆర్ సన్నిహితుడు, మైహోం అధినేత జూపల్లి రామేశ్వరరావుతో కూడా దాదాపు గంట సేపు హైదరాబాద్ లో చంద్రబాబు చర్చలు జరిపినట్టు రాజకీయవర్గాలు అనుమానిస్తున్నాయి.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఆయనకు అనేక కాంట్రాక్టులు చంద్రబాబు అప్పగించారు.
ఇక ఆ తరువాత రాజకీయ పరిస్థితులు కారణంగా వారు దూరం అయ్యారు.కానీ ఇప్పుడు ఆయనతో పాత పరిచయం గుర్తు చేసుకుని బాబు చేయబోతున్న కొత్త రాజకీయం ఏంటో ఎవరికీ అంతుపట్టడంలేదు.