తెలంగాణలో దాదాపుగా తెలుగుదేశం పార్టీ కనుమరుగైపోయినా ఆ పార్టీ అధినేత చంద్రబాబు లో మాత్రం మళ్లీ పార్టీకి పునర్వైభవం వస్తుందనే ఆశలు మాత్రం పోలేదు.ఒక పక్క ఏపీ లో బిజీగా రాజకీయాలు నడిపిస్తూనే, తెలంగాణలో పార్టీకి ఊపిరి పోసే విధంగా చంద్రబాబు వ్యవహరిస్తున్నారు.
దానిలో భాగంగానే ఆయనకు సమయం దొరికినప్పుడల్లా తెలంగాణ నాయకులతో సమావేశాలు నిర్వహిస్తూ, పార్టీ పటిష్టత పై ఎప్పటికప్పుడు సలహాలు సూచనలు ఇస్తూ ఉంటారు.అదే తరహాలో తాజాగా ఓ సమావేశాన్ని చంద్రబాబు నిర్వహించారు.
ఈ సందర్భంగా పార్టీ సీనియర్ నాయకుల పని తీరుపై చంద్రబాబు తీవ్రస్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.పార్టీకి పూర్వవైభవం తీసుకురావాలనే శ్రద్ధ ఎవరికీ లేదని, కేవలం తాను ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ కి వస్తున్నప్పుడు మాత్రమే నాయకులు హడావుడి చేస్తున్నారు తప్ప మిగతా సమయంలో పార్టీ గురించి ఏ ఒక్కరు పట్టించుకోవడంలేదని బాబు మండిపడ్డారు.
ఇలా చేయడం వల్ల పార్టీకి మరింత దుర్భర పరిస్థితి వస్తుందని, నిత్యం నాయకులంతా ప్రజల్లోకి వెళ్లి వారి సమస్యల మీద ప్రభుత్వంపై పోరాటం చేయాలని, రాష్ట్ర నాయకత్వం మొత్తం సమిష్టిగా పని చేస్తే ప్రజల్లో గుర్తింపు వస్తుందన్నారు.మళ్లీ తెలుగుదేశం పార్టీకి పునర్వైభవం వస్తుందంటూ చంద్రబాబు గట్టిగా క్లాస్ పీకినట్టు తెలుస్తోంది.అలాగే కమిటీల ఏర్పాటు ఆలస్యంపైనా చంద్రబాబు ప్రశ్నించారు.రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ కోసం పనిచేస్తున్న వారు చాలామంది ఉన్నారని, వారిని రాష్ట్ర నాయకత్వం ఎందుకు గుర్తించడం లేదంటూ చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.
కార్యకర్తలని నాయకులుగా తయారు చేసుకుని ప్రజల్లో బలం పెంచుకోవాలని చంద్రబాబు సూచించారు.
చంద్రబాబు ఆగ్రహంతో ఉండడంతో వెంటనే స్పందించిన తెలంగాణ టిడిపి అధ్యక్షుడు ఎల్ రమణ అందరూ కలిసే నిర్ణయాలు తీసుకుంటున్నామని, ఈ పరిస్థితిలో మార్పు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తామని చెప్పినట్లు తెలుస్తోంది.ఈ సందర్భంగా టిఆర్ఎస్ ను చంద్రబాబు మెచ్చుకున్నారు.టిఆర్ఎస్ ఇక్కడ ప్రతిపక్షాలకు గౌరవం ఇస్తోందని, కానీ ఏపీలో పరిస్థితి అధ్వాన్నంగా ఉందని బాబు చెప్పినట్లు తెలుస్తోంది.
టిడిపి జాతీయ అధ్యక్షుడిగా ఉన్న చంద్రబాబు కొద్ది రోజులపాటు తెలంగాణలో సభలు, సమావేశాలు, యాత్రలు వంటివి చేపడితే ఫలితం ఉంటుంది తప్ప ఇప్పటికిప్పుడు పార్టీని పరుగులు పెట్టించాలంటే కష్టం అంటూ మరికొందరు గుసగుసలాడుకుంటున్నారు.