ఏపీలో కొత్త జిల్లాలు ఏర్పాటు కాబోతున్నాయి.ప్రస్తుతం ఏపీలో 13 జిల్లాలు ఉండగా, వాటిని 26కు పెంచుతూ ఏపీ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీచేసింది.
అంతేకాదు ఈ 26 జిల్లాలకు కొత్త పేర్లను సూచిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది.దాదాపు నెల రోజుల పాటు వీటిపై అభ్యంతరాలను స్వీకరించి, ఉగాది నాటికి ఈ కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియను ముగించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది.
ఈ సందర్భంగా కొత్త జిల్లాల్లో ఆయా ప్రాంతాలలో ఉన్న ప్రముఖ నాయకులు, ఆ ప్రాంతానికి తగిన గౌరవం గుర్తింపు తీసుకొచ్చిన వారి పేర్లు ఆధారంగా కొత్త జిల్లాల పేర్లను వైసీపీ ప్రభుత్వం తెరపైకి తీసుకువచ్చింది.అదేవిధంగా టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ పేరును కొత్త జిల్లాగా ఏపీ ప్రభుత్వం తెరపైకి తీసుకు వచ్చింది.
అయితే ఈ వ్యవహారంలో టిడిపి అధినేత చంద్రబాబు, ఆ పార్టీ నాయకులు పూర్తిగా మౌనంగా ఉన్నారు.వైసీపీ ప్రభుత్వం ఏ కీలక నిర్ణయం తీసుకున్న వెంటనే రియాక్ట్ అయ్యి, తన దైన శైలిలో విమర్శలు చేస్తూ, తమ పార్టీ నాయకులతో విమర్శలు చేయిస్తూ, హడావుడి చేసే చంద్రబాబు ఈ విషయంలో మాత్రం మౌనంగా ఉండిపోవడం పార్టీ శ్రేణులకు సైతం అంతు పట్టడం లేదు.
విజయవాడను ఎన్టీఆర్ జిల్లాగా నామకరణం చేయడం పై నందమూరి కుటుంబం నుంచి ఒక్క పురంధరశ్వరి తప్ప మరెవరు స్పందించలేదు.దీనిపైన ఏపీలో జోరుగా చర్చ జరుగుతోంది.
టీడీపీ 2014 అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త జిల్లాల ఏర్పాటు విషయమై ముందుకు వెళ్ళింది.అయితే అప్పట్లో ఈ వ్యవహారం ఆర్ధిక భారంగా మారుతుందనే ఆలోచనలతో సైలెంట్ అయిపోయింది.
అయితే జగన్ మాత్రం పాదయాత్ర సమయంలోనే కొత్త జిల్లాల ప్రతిపాదన తీసుకువచ్చారు.దానికి తగ్గట్లుగానే ఇప్పుడు కసరత్తు మొదలు పెట్టారు .దీంతో ఈ విషయంలో ఏ విధంగా ముందుకు వెళ్లాలనే విషయంలో చంద్రబాబు తర్జనభర్జన పడుతున్నట్లు సమాచారం.అందుకే కొత్త జిల్లాలు, వాటి పేర్ల విషయంలో ప్రజలకు నుంచి ఎదురవుతున్న ఇబ్బందులు , కొన్ని జిల్లాలకు కొంతమంది నాయకుల పేర్లు పెట్టకుండా , వేరే పేర్లు సూచించడం పై పెరుగుతున్న వ్యతిరేకత ఇలా అనేక అంశాలను పరిగణలోకి తీసుకుంటున్నట్లు సమాచారం.
తొందరపడి ప్రభుత్వంపై ఈ విషయంలో విమర్శలు చేసినా, అది తమకు ఇబ్బందికరంగా మారుతుందని ఉద్దేశంతోనే చంద్రబాబు ఆచితూచి దీనిపై స్పందించేందుకు చూస్తున్నారట.అందుకే ప్రస్తుతానికి మౌనంగానే ఉండడం బెటర్ అనే ఆలోచనలో ఉన్నారట.