టీడీపీ అధినేత చంద్రబాబు రాజకీయంగా పైచేయి సాధించేందుకు అన్ని రకాలుగానూ ఎత్తుగడలు వేస్తున్నారు.ఇప్పటికే వైసీపీ ప్రభుత్వంపై పెద్ద ఎత్తున ప్రజాగ్రహం ఉందని, దానిని సక్రమంగా, తమకు అనుకూలంగా మార్చుకోగలగితే, రానున్న రోజుల్లో తిరిగే ఉండదని బాబు అభిప్రాయపడుతున్నారు.
కరోనా వైరస్ ప్రభావంతో ఇప్పటి వరకు ఆన్లైన్ ద్వారానే, జూమ్ ద్వారా పార్టీ కార్యక్రమాలను సమీక్షించారు.జిల్లాల వారీగా, నియోజకవర్గాల వారీగా, సమీక్షలు నిర్వహిస్తూ, పార్టీ శ్రేణుల్లో భరోసా పెంచే ప్రయత్నం చేస్తూ వచ్చారు.
అయితే సుదీర్ఘకాలం ఇలా జూమ్ యాప్ ద్వారా మాత్రమే అందుబాటులో ఉంటే, రానున్న రోజుల్లో తెలుగుదేశం పార్టీకి ఇబ్బందులు తప్పవని అభిప్రాయపడుతున్నారు.అందుకే బాబు జిల్లాల వారీగా పర్యటన చేయాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.
ఇప్పుడిప్పుడే కరోనా వైరస్ ప్రభావం తగ్గుముఖం పడుతుండటంతో, జిల్లాల వారీగా పర్యటన చేసినందుకు రూట్ మ్యాప్ సిద్ధం చేసుకుంటున్నట్లు సమాచారం.అయితే ముందుగా ఏ జిల్లా నుంచి బాబు పర్యటన చేయాలనే విషయంపై క్లారిటీ లేకపోవడంతో, దీనిపై బాబు సీరియస్ గానే కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.
ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో పర్యటన చేయాలని, దానిలో భాగంగా శ్రీకాకుళం జిల్లా నుంచి దీనికి శ్రీకారం చుట్టాలని బాబు అభిప్రాయపడుతుండగా, అమరావతి నుంచి యాత్రను చేపట్టాలని పార్టీ శ్రేణులు ఒత్తిడి చేస్తున్నట్లు సమాచారం.అయితే బాబు మాత్రం శ్రీకాకుళం నుంచే పర్యటన చేయాలనీ డిసైడ్ అయ్యారట.
దీనికి కారణం జగన్ విశాఖలో రాజధాని ఏర్పాటుకు మొగ్గు చూపుతున్న పరిస్థితుల్లో, అక్కడ పార్టీకి మరింత బలం చేకూర్చుతూ, పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం పెంచాలని డిసైడ్ అయ్యారట.లేకపోతే ఉత్తరాంధ్ర జిల్లాల్లో టిడిపి తుడిచిపెట్టుకుపోతోంది అనే అభిప్రాయం వస్తున్న తరుణంలో అక్కడ నుంచే యాత్ర మొదలు పెడితే బాగుంటుందని భావిస్తున్నారట.
చంద్రబాబే కాకుండా, ఆయన తనయుడు నారా లోకేష్ సైతం జిల్లాల వారీగా, నియోజకవర్గాల వారీగా పర్యటనలు చేపట్టి పార్టీలో కొత్త ఉత్సాహం తీసుకురావాలని చూస్తున్నారట.అదీ కాకుండా, మరి కొద్ది నెలల్లోనే స్థానిక సంస్థల ఎన్నికలు కూడా జరగబోయే అవకాశం ఉండటంతో, బాబు ఈ విధంగా జిల్లాల పర్యటన వైపు మొగ్గు చూపుతున్నట్లు, ఆ పార్టీలోని సీనియర్ నాయకులు చెబుతున్న మాట.