మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబులో ఉన్న అతి పెద్ద మైనస్ నాన్చడం.ఎలాంటి కీలక విషయం అయినా ఎవరిని నమ్మక నాన్చుతూ వస్తూ ఉంటారు.
తీరా చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా ఆయన నిర్ణయం తీసుకునే సరికే టైం అయిపోయి అప్పటికే కర్మకాలి పోతుంది.ఎవరికి అయినా ఓ పదవి ఇవ్వాలన్నా… ఓ సీటు ఇవ్వాలన్నా.
నియోజకవర్గ పగ్గాలు ఇవ్వాలన్న చంద్రబాబు ఆ విషయాన్ని తేల్చక నాన్చుతూ నాన్చుతూ టైంను కేక్ తిన్నట్టు తింటారని టీడీపీ వాళ్లే సెటైర్లు వేసుకుంటున్నారు. గత ఎన్నికల్లో పార్టీ ఓడిపోయాక ఎంత గడ్డు పరిస్థితి ఎదుర్కొంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
ప్రస్తుతం పార్టీ ఇన్చార్జ్లు లేని నియోజకవర్గాలు ఏపీలో దాదాపు 30 వరకు ఉన్నాయి.అక్కడ పార్టీ జెండా మోసే నాథుడే లేడు.ఇలాంటి టైంలో ఆ నియోజకవర్గాల్లో పార్టీ పగ్గాలు తీసుకునేందుకు చాలా మంది నేతలు క్యూలో ఉన్నారు.వీరిలో ఎవరో ఒకరికి అక్కడ పగ్గాలు ఇస్తే పార్టీ ట్రాక్లోకి వస్తుంది.
అయితే బాబు మాత్రం ఇప్పటకీ ఈ విషయంపై అస్సలు దృష్టి పెట్టడం లేదు.
ఇప్పటకి బాబును కేడర్ నమ్మడం లేదన్న టాక్ సొంత పార్టీ వర్గాల్లోనే వినిపిస్తోంది.
ఈ నియోజకవర్గాలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఆయా నియోజకవర్గాల్లో ఎవరు అయితే కష్టపడుతున్నారో ? వారికే వచ్చే ఎన్నికల్లో సీట్లు ఇస్తానని చంద్రబాబు ప్రకటిస్తే ఖచ్చితంగా వారంతా ఆ నియోజకవర్గాల్లో ఇప్పటి నుంచే గెలవాలన్న కసితో కష్టపడతారు.ఈ క్రమంలోనే అధికార వికేంద్రీకరణ అన్నట్టుగా పార్లమెంటరీ జిల్లాల వారీగా పార్టీ అధ్యక్షులను నియమించడం, రెండు పార్లమెంటరీ జిల్లాలకు ఓ కో ఆర్డినేటర్ను నియమించడంతో నేతలు పార్టీపై దృష్టి పెట్టే అవకాశం ఏర్పడింది.
ఎక్కడికక్కడ సమస్యలను వెంటనే పరిష్కరించేందుకు కూడా ఇది ఉపయోగపడనుంది.ఏదేమైనా చంద్రబాబు పట్ల సొంత పార్టీ నేతల్లో నమ్మకం ఏర్పడాలంటే ఎక్కడికక్కడ నియోజకవర్గాల్లో పార్టీ నేతలకు టిక్కెట్లు ఇస్తానని ఓపెన్గా ప్రకటించడమే ముఖ్యమైన పాయింట్.
మరి ఈ విషయంలో బాబు ఈ వయస్సులో కూడా నాన్చుతాడా ? లేదా ? ధైర్యంగా ప్రకటన చేస్తారా ? అన్నది చూడాలి.