వైసీపీ ఫైర్ బ్రాండ్, చిత్తూరు జిల్లా నగరి వైసీపీ ఎమ్మెల్యే ఆర్కె.రోజాపై వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే టీడీపీ అభ్యర్థి ఎవరు ? ఈ ప్రశ్నకు టీడీపీలో ఆన్సర్ దొరకడం లేదు.గత ఎన్నికల్లో ఇక్కడ వైసీపీ నుంచి పోటీ చేసిన రోజా టీడీపీ సీనియర్ లీడర్ గాలి ముద్దుకృష్ణమనాయుడును 926 ఓట్ల మెజార్టీతో ఓడించారు.ఆ తర్వాత గాలి ఎమ్మెల్సీ అయ్యి తిరిగి నియోజకవర్గంలో ఆధిపత్యం సాధించారు.
అనూహ్యంగా ఆయన మృతి చెందడంతో ఇప్పుడు నగరిలో టీడీపీకి రోజాను ఢీకొట్టే సరైన లీడర్ లేకుండా పోయాడు.వాస్తవంగా చూస్తే ముద్దు తర్వాత ఆయన వారసులుగా ఇద్దరు కుమారులు రేసులో ఉన్నారు.
వీరిద్దరు ముద్దుకృష్ణమ రాజకీయ పగ్గాల కోసం ఎవరికి వారు తమకే కావాలని పట్టుదలకు పోవడంతో ముద్దు కుటుంబంలో విబేధాలు ప్రస్పుటమయ్యాయి.ముద్దు మృతితో ఆ ఎమ్మెల్సీ స్థానం కోసం ఇద్దరు వారసులు అయిన గాలి భానుప్రకాశ్నాయుడు, జగదీశ్ ఇద్దరూ పోటీ పడ్డారు.చివరకు చంద్రబాబు వీరి మధ్య సయోధ్య కుదర్చలేక వార్నింగ్ ఇచ్చి గాలి భార్య సరస్వతమ్మకు ఇచ్చేశారు.ఇక వచ్చే ఎన్నికల్లో నగరి అసెంబ్లీ సీటు విషయంలోనూ ఇప్పుడు మళ్లీ వీరిద్దరు పోటీకి దిగుతున్నారు.
నగరి టీడీపీ సీటును తమకే కావాలని భానుప్రకాశ్ నాయుడుతో పాటు జగదీశ్ ఇద్దరూ ఎత్తులు, పై ఎత్తులు వేసుకోవడంతో నియోజకవర్గంలో గాలి అనుచరగణంతో పాటు టీడీపీ అభిమానులు సైతం రెండుగా చీలుతున్నారు.వాస్తవంగా చూస్తే గాలి తన వారసుడిగా పెద్ద కుమారుడు భానుప్రకాశ్నే నగరిలో దింపాలని అనుకున్నారు.
గాలి ఫ్యామిలీయే టిక్కెట్ కోసం రెండుగా చీలిపోవడంతో ఇక్కడ రోజాను ఢీకొట్టే సీన్ వాళ్లకు లేదని చంద్రబాబు డిసైడ్ అయిపోయారు.
ఈ క్రమంలోనే టీటీడీకి చెందిన ఓ ఉన్నతాధికారిని ఇక్కడ పోటీ చేయించాలని బాబు ప్లాన్ చేస్తున్నారు.
ఆయన ఆర్థికంగా బలమైన వ్యక్తే అయినా కమ్యూనిటీ పరంగా చూస్తే నగరి నియోజకవర్గంలో వీక్గా ఉన్నారు.దీంతో తన సామాజికవర్గానికే చెందిన మరో వ్యక్తి పేరును కూడా నగరిలో పోటీకి పరిశీలిస్తున్నారు.
గత నాలుగేళ్లుగా రోజా టీడీపీ, చంద్రబాబుపై ఎంత ఫైట్ చేశారో తెలిసిందే… వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా నగరిలో ఆమెను ఓడించాలని నిన్నటి వరకు ప్రణాళికలతో ఉన్న చంద్రబాబుకు ఇప్పుడు ఫైనల్గా రోజాను ఢీకొట్టే సరైన ప్రత్యర్థి కోసం వెతుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.