ఏపీలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న తెలుగుదేశం పార్టీ ఆ హోదాను కాపాడుకునేందుకు గట్టిగానే ప్రయత్నాలు చేస్తోంది.అలాగే పార్టీ నేతలు ఎవరూ, ఇతర పార్టీల్లో చేరకుండా చూసుకునేందుకు ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేస్తోంది.
ఖచ్చితంగా వచ్చే ఎన్నికలలో అధికారం మనకే దక్కుతుందని, అధికార పార్టీ వైసీపీపై ప్రజల్లో వ్యతిరేకత ఉందని, ఎన్నో అంశాలను ప్రస్తావిస్తూ పార్టీ నేతలకు భరోసా ఇచ్చే విధంగా చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు.కానీ నాయకుల్లో మాత్రం ఎక్కడా ఆ నమ్మకం కుదరడం లేదు.
టిడిపి కి రాజకీయ భవిష్యత్తు ఉండదని, చంద్రబాబు తర్వాత పార్టీని ఆ స్థాయిలో నడిపించగలిగిన సమర్థులెవరు లేరనేది ఆ పార్టీ నాయకుల్లో ఉన్న అభిప్రాయం.ఇక చంద్రబాబు వారసుడిగా లోకేష్ ఉన్నా ఆయనపై ఎవరికి పెద్దగా నమ్మకాల్లేవ్.
దీంతో అధికార పార్టీపై పోరాటం చేసేందుకు టిడిపి నాయకులు ఎవరూ ఉత్సాహం చూపించడం లేదు. పార్టీ నుంచి ఆదేశాలు వస్తున్నా, పట్టించుకునే వారే కరువయ్యారు.
అసలు నియోజకవర్గ స్థాయిలో పార్టీ తరఫున కార్యకర్తలతో పోరాటాలు చేసే నాయకుల కొరత టిడిపిని పట్టిపీడిస్తోంది.ఈ క్రమంలో టిడిపి పాత్రను బిజెపి తీసుకుంది.
ప్రధాన ప్రతిపక్షం తామే అన్నట్టుగా వ్యవహరిస్తూ హడావుడి చేస్తోంది.బీజేపీకి ఏపీలో ఆదరణ బాగా పెరిగినట్టుగానే కనిపిస్తోంది.
దీంతో వైసిపి వర్సెస్ బిజెపి అన్నట్టుగా వ్యవహారం సాగుతోంది.ఈ కారణాలతో టిడిపి సైడ్ ఐపోయినట్టుగా కనిపిస్తోంది.
అసలు బిజెపికి ఈ స్థాయిలో ఆదరణ రావడానికి కారణం తెలుగుదేశం పార్టీ.ఆ పార్టీ నాయకులు.
వారి కారణంగానే బీజేపీకి ఏపీలో బలపడే అవకాశం దక్కింది.దీనికి తోడు చంద్రబాబు సైతం హైదరాబాద్ లోని ఇంటికే పరిమితమైపోవడం, ఆన్లైన్ వేదికగానే యాక్టివ్ గా ఉండటం ఇవన్నీ బీజేపీకి కలిసి వస్తున్నాయి.బీజేపీ బలం పుంజుకోవడానికి తెలుగుదేశం పార్టీనే అవకాశం ఇచ్చింది అనేది అందరి అభిప్రాయం.ప్రస్తుతం దేవాలయాల అంశం మరి కొన్ని ప్రజా సమస్యల విషయంలో బిజెపి పోరాటం చేస్తూ, బలం పుంజుకున్నట్లుగా వివిధ సర్వేల్లో తేలింది.
రానున్న రోజుల్లో టిడిపి స్థానం బిజెపి పూర్తిగా ఆక్రమించి, టిడిపి ని మరింతగా దెబ్బతీసే విషయంపైనే వైసిపి, బిజెపి లు ప్రయత్నిస్తాయి అనడంలో సందేహం లేదు.