ఏపీ ప్రధాన ప్రతిపక్షం టిడిపిలో పార్టీ నాయకుల వ్యవహారం నిత్యం చర్చకు వస్తోంది.పార్టీలో ఎవరు ఉంటారో ? ఎవరు వెళ్ళిపోతారో తెలియని పరిస్థితి ఉంది.టిడిపి నాయకులే టార్గెట్ గా వైసీపీ ప్రభుత్వం అనేక కేసులు నమోదు చేస్తూ, అనేక రకాలుగా వేధింపులకు గురిచేస్తోందనే అభిప్రాయానికి టిడిపి నేతలు రావడంతో, వారిలో కాస్త అలజడి రేగింది.మరో మూడు నెలల పాటు ఇదే పరిస్థితి ఉంటుంది కాబట్టి, అధికార పార్టీ వైసీపీలో చేరితే తమకు ఏ ఇబ్బంది ఉండదనే అభిప్రాయంలో ఉంటూ వచ్చారు.
కానీ ఇప్పుడు వైసీపీకి కూడా కాస్త ఎదురుగాలి వీస్తుండడం, ఆ పార్టీలో గ్రూపు రాజకీయాలు పెరిగిపోతుండడం, తాము పార్టీలో చేరినా, స్థానిక వైసీపీ నాయకులతో నిత్యం తగాదాలు పడాల్సి వస్తుందనే అభిప్రాయంతో చాలా మంది నేతలు వెనక్కి తగ్గినట్లుగా కనిపిస్తున్నారు.
వైసీపీ అధికారంలోకి వచ్చిన మొదట్లో ఎమ్మెల్యేలపై దృష్టి పెట్టి, వారిని పార్టీలో చేర్చుకుని ఆ పార్టీకి మద్దతు గా ఉండేలా, టిడిపికి రాజీనామా చేయించేవారు.
ఆ విధంగానే టిడిపి ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ, కరణం బలరాం వంటివారు వైసీపీ కండువా కప్పుకోకపోయినా, వైసీపీ అనుబంధ సభ్యులుగానే కొనసాగుతున్నారు.ఈ క్రమంలో పెద్ద ఎత్తున టిడిపి ఎమ్మెల్యేలు తమ పార్టీలోకి వస్తారని వైసిపి అంచనా వేసినా వారు ఎవరు ముందుకు రాని పరిస్థితి ప్రస్తుతం టిడిపి కనిపిస్తుండటం, వైసీపీలో చేరినా పెద్దగా ప్రాధాన్యం ఉండదనే అభిప్రాయంతో చాలా మంది ఎమ్మెల్యేలు, కీలక నాయకులు వైసీపీలో చేరేందుకు పెద్దగా ఆసక్తి చూపించడం లేదు.
ముఖ్యంగా గంటా శ్రీనివాసరావు వంటివారు కుదిరితే వైసీపీ, లేక బీజేపీలో చేరతారనే ప్రచారం జరిగినా, ఆయన పూర్తిగా సైలెంట్ అయిపోయారు.ఈ విధంగా నేతల వలసలకు కాస్త బ్రేక్ పడటంతో, చంద్రబాబు సైతం చాలా ఖుషీగా కనిపిస్తున్నారట.
ఇకపై పార్టీ నేతలకు భరోసా కల్పించి టిడిపి రాజకీయ భవిష్యత్తుకు ఏ ఢోకా లేదని నిరూపించేందుకు ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తున్నారు.