హెచ్ 1 బీ వీసాలపై ఆధారపడటాన్ని తగ్గించుకునేందుకు గాను భారతదేశానికి చెందిన అతిపెద్ద ఐటీ సేవల సంస్థ టీసీఎస్ 20,000 మంది అమెరికన్లను రిక్రూట్ చేసుకున్నట్లు ప్రకటించింది.గత ఐదేళ్లుగా టీసీఎస్ 20,000 మంది అమెరికన్లను నియమించుకున్నట్లు సంస్థ మానవ వనరుల విభాగం గ్లోబల్ హెడ్ మిలింద్ లక్కాడ్ తెలిపారు.
ఈ ఆర్ధిక సంవత్సరంలో అమెరికన్ల నియామకం .సాధారణ రేటు కంటే 2.5 రెట్లు పెరిగింది.టీసీఎస్ ప్రతి ఏటా వందలాది మంది గ్రాడ్యుయేట్లను నియమించుకుని, శిక్షణ ఇస్తుందని మిలింద్ అన్నారు.
ఈ ఏడాది నియమించుకున్న వారిని ఎక్కువగా షార్ట్ టర్మ్ అసైన్మెంట్, సబ్ కాంట్రాక్ట్ పనుల కోసం ఎంపిక చేసుకున్నట్లు ఆయన వెల్లడించారు.
కాగా అమెరికా ప్రభుత్వం జారీ చేసే హెచ్ 1 బీ వీసాను పొందడం రోజురోజుకు కష్టతరం అవుతున్న నేపథ్యంలో… ఈ వీసాపై ఆధారపడటాన్ని తగ్గించాని నిర్ణయించింది.
ఈ క్రమంలో అమెరికన్ ప్రాజెక్ట్ల కోసం భారత్/ విదేశీయులు కాకుండా స్థానిక అమెరికన్లను నియమించుకోవడం ఒక్కటే పరిష్కారంగా కంపెనీ భావించింది.ఈ నిర్ణయం సమయాన్ని, ఖర్చులను ఆదా చేయడంతో పాటు నియామకాలు వేగంగా జరగడానికి ఉపకరిస్తుందని టీసీఎస్ చెబుతోంది.
ఇదే సమయంలో భారతీయ ఉద్యోగుల కోసం హెచ్ 1 బీ వీసా పొందడానికి నెలలు వేచి ఉండాల్సి రావడం వల్ల కంపెనీ.స్దానిక అమెరికన్ల వైపు మొగ్గుచూపింది.అయితే అమెరికన్ల నియామకం భారతీయుల ఉద్యోగావకాశాలను దెబ్బతీస్తుందా అన్న ప్రశ్నకు మిలింద్ మాట్లాడుతూ.తమ నిర్ణయం వల్ల భారతీయులకు ఎలాంటి ఇబ్బంది లేదని తెలిపారు.కాగా కొద్దిరోజుల క్రితం అమెరికాలో చదివిన విదేశీయులకే హెచ్ 1 బీ వీసా జారీలో తొలి ప్రాధాన్యత ఇవ్వాలని అమెరికా చట్టసభల్లో బిల్లును ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే.స్థానికులకు దక్కాల్సిన ఉద్యోగాలను హెచ్ 1 బీ, ఎల్ 1 వీసాదారులతో భర్తీ చేయడాన్ని నిషేధించాలని కూడా సదరు బిల్లులో ప్రతిపాదించారు.