తెలంగాణ కాంగ్రెస్ లో పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చినట్లుగానే కనిపిస్తోంది .పార్టీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా ఒకవైపు తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తెలంగాణ వ్యాప్తంగా హత్ సే హాథ్ జోడో యాత్రను నిర్వహిస్తున్నారు.
దీనికి కాంగ్రెస్ నుంచి మద్దతు లభిస్తుంది .రేవంత్ ప్రసంగాలపై ప్రజల్లోనూ ఉత్సాహం కనిపిస్తోంది. బీఆర్ ఎస్, బిజెపిలకు దీటుగా కాంగ్రెస్ ఈ యాత్ర ద్వారా ప్రజలకు చేరువ అవుతుందని అంతా అంచనా వేస్తూ ఉండగానే. ఇప్పుడు పోటాపోటీగా యాత్రలు నిర్వహించేందుకు తెలంగాణ కాంగ్రెస్ సీనియర్లంతా సిద్ధం అవ్వడం, ఎవరికి వారు సొంతంగా ఏర్పాట్లు చేసుకుంటూ ఉండడంతో కాంగ్రెస్ లో గందరగోళ పరిస్థితి తలెత్తే విధంగా కనిపిస్తోంది.
రాష్ట్రవ్యాప్తంగా రేవంత్ రెడ్డి పాదయాత్ర నిర్వహించాలని ముందుగా భావించినా, సీనియర్లు నుంచి కొన్ని అభ్యంతరాలు వ్యక్తం కావడంతో,
ఆయన పాదయాత్రను వాయిదా వేసుకుని హత్ సే హాథ్ జోడో యాత్రలు చేస్తున్నారు.ఇప్పుడు రేవంత్ పోటీగా కొంతమంది రాష్ట్ర జిల్లా స్థాయి నేతలు సొంతంగా పాదయాత్రలు చేపట్టేందుకు షెడ్యూల్ రూపొందించుకున్నారు.
నిన్ననే రేవంత్ రెడ్డి పాదయాత్రకు పోటీగా ‘ తెలంగాణ కాంగ్రెస్ పోరు యాత్ర పేరుతో మాజీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి యాత్రను ప్రారంభించారు.ఏఐసిసి అనుమతితో బాసర పుణ్యక్షేత్రం నుంచి హైదరాబాద్ వరకు తాను యాత్ర చేస్తానని ఇప్పటికే ఏలేటి ప్రకటించారు .ఆయనకు తెలంగాణ కాంగ్రెస్ సీనియర్లు మద్దతు పలుకుతున్నారు. ఇక సీఎల్పీ నేత బట్టి విక్రమార్క, టీపీసీసీ మాజీ అధ్యక్షుడు ఉత్తంకుమార్ రెడ్డి,
మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ తదితరులు ఈ యాత్రలో పాల్గొనడం చర్చనియాంశంగా మారింది. ఇక మహేశ్వర్ రెడ్డి కంటే ముందుగా సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క కూడా యాత్రకు ప్లాన్ చేశారు.బాసర పుణ్యక్షేత్రం నుంచి హైదరాబాద్ వరకు యాత్ర చేపట్టాలనుకున్నారు.
కానీ ఇప్పుడు ఆ యాత్రను ఏలేటి మహేశ్వర్ రెడ్డి ప్రారంభించారు.భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ పేరుతో తాను ప్రాతినిధ్యం వహిస్తున్న మధిర నియోజకవర్గం నుంచి పాదయాత్ర గతంలోనే పూర్తి చేశారు.
ఇప్పుడు హాథ్ సే హాథ్ జోడో యాత్రలో భాగంగా మళ్లీ పీపుల్స్ మార్చ్ పేరుతో రాష్ట్రంలోని ఇంకొన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో పాదయాత్ర చేపట్టేందుకు విక్రమార్క ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
అలాగే టిపిసిసి ప్రచార కమిటీ చైర్మన్ గా ఉన్న మధుయాస్కి గౌడ్ కూడా యాత్ర చేపట్టేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు.కాంగ్రెస్ పార్టీకి విద్యార్థుల మద్దతు ఉండే విధంగా ఆయన విశ్వవిద్యాలయాల్లో ఈ యాత్ర చేపట్టాలనే ఆలోచనలో ఉన్నారు.దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకున్నారు.
అలాగే పిసిసి మాజీ అధ్యక్షుడు ఉత్తంకుమార్ రెడ్డి కూడా యాత్ర చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు.ఒకవైపు రేవంత్ యాత్రలకు అనూహ్య స్పందన వస్తున్న సమయంలోనే, పోటాపోటీగా మిగిలిన సీనియర్ నాయకులు యాత్రలు చేపట్టేందుకు సిద్ధమవడం, రేవంత్ యాత్రలకు వారు దూరంగా ఉండడం వంటివి తెలంగాణ కాంగ్రెస్ లో నెలకొన్న సమన్వయ లోపం, గ్రూపు రాజకీయాలను మరోసారి తెరపైకి వచ్చేలా చేస్తోంది.