తెలంగాణలో బీజేపీకి వాపు కూడా లేకుండానే ఆ పార్టీ నాయకులు తమకు బలుపు ఉందని తెగ ఊదరగొట్టేస్తున్నారు.వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో అధికారంలోకి వచ్చేది తామేనంటూ బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా నుంచి తెలంగాణ నాయకుల వరకు ఒక్కటే వ్యాఖ్యలు ఊదరగొట్టేస్తున్నారు.
ప్రస్తుతం తెలంగాణలో కేసీఆర్, టీఆర్ఎస్ హవా కొనసాగుతున్న టైంలో బీజేపీ నాయకుల వ్యాఖ్యలు చాలామందికి కామెడీగానే కనిపిస్తున్నాయి.
బీజేపీ నాయకుల వ్యాఖ్యలు ఇలా ఉంటే తెలంగాణలో మిగిలిన రాజకీయ పక్షాలు మాత్రం ఇప్పుడు ఎన్నికలు జరిగినా, వచ్చే ఎన్నికల్లో అయినా ఒక్కటంటే ఒక్క సీటు కూడా రాదంటున్నారు.
నిన్నటికి నిన్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తనపై చేసిన విమర్శలకు స్పందించిన కేసీఆర్ ఇప్పుడు తెలంగాణ ఎన్నికలు జరిగితే బీజేపీకి ఒక్క సీటు కూడా రాదని తేల్చేశారు.
ఇక ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ అయితే అమిత్ షాకు దిమ్మతిరిగే సవాల్ విసిరారు.
షాకు దమ్ముంటే హైదరాబాద్లో తనపై పోటీ చేసి గెలవాలని ఆయన సవాల్ చేశారు.తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో బీజేపీ తుడిచి పెట్టుకుపోవడం ఖాయమని అసదుద్దీన్ జోస్యం చెప్పారు.
ఇక అంబర్పేట అసెంబ్లీ సీటుతో పాటు సికింద్రాబాద్ ఎంపీ సీటును కూడా తాము గెలుస్తామని ఆయన తెలిపారు.
మరి అసద్ వ్యాఖ్యలను బట్టి చూస్తుంటే ఆ పార్టీ కిషన్రెడ్డి, దత్తాత్రేయలను ఓడిచేందుకు టార్గెట్గా పెట్టుకున్నట్టే కనపడుతోంది.
ఇక కేసీఆర్ సైతం ఇక్కడ బీజేపీకి సింగిల్ సీటు రాదన్నారు.దీనిని బట్టి ఇక్కడ బీజేపీని దెబ్బకొట్టేందుకు టీఆర్ఎస్, ఎంఐఎం మధ్య ఏదైనా ఇంటర్నల్ అండర్స్టాండింగ్ నడుస్తోందా ? అన్న అనుమానాలు సైతం తెలంగాణ రాజకీయవర్గాల్లో వినిపిస్తున్నాయి.