ఈ మధ్యకాలంలో ప్రజలకి మనోభావాల పిచ్చి ఎక్కువైపోయింది.ప్రతి చిన్న విషయాన్ని బూతద్దంలో చూస్తూ పలానా సినిమాలో పలానా సీన్ తమ మనోభావాలని కించపరిచే విధంగా ఉందని ఆందోళన చేయడం, రోడ్డు మీదకి ఎక్కి రాద్దాంతం చేయడం.
ఒక్కోసారి మరింత శ్రుతిమించి దాడుల వరకు వెళ్ళడం చేస్తున్నారు.సినిమా, యాడ్స్ అనేవి కేవలం ఎంటర్టైన్మెంట్ కోసం మాత్రమే అని చూడకుండా కించపరిచే సన్నివేశాలు ఉంటే హడావిడి చేస్తున్నారు.
అయితే ఈ హడావిడి వలన సినిమాకి మరికొంచెం పబ్లిసిటీ వస్తుంది తప్ప జరిగే నష్టమేమీ లేదు.అయితే సినిమాలు, యాడ్స్ విషయంలో కూడా ఒక్కోసారి కావాలని కొంత మంది దర్శకులు, క్రియేటర్స్ వివాదాస్పద అంశాలని తీసుకొని సినిమాలు, యాడ్స్ చేసి వాటిని జనం మీదకి వదిలేసి తన్నుకు చావండి అనే విధంగా చూస్తూ ఉంటారు.
ఈ నేపధ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా సినిమాలు, యాడ్స్ విషయంలో ప్రత్యేకంగా దృష్టి పెట్టాల్సి వస్తుంది.ఎవరిని కించపరిచే విధంగా కథ, కథనాలు ఉండాలని ముందుగానే సూచిస్తున్నారు.
అలాగే కించపరిచే సన్నివేశాలు ఉన్న వాటిని తొలగించాలని సూచిస్తున్నారు.అలాగే వివాదాస్పద కథలని సినిమాలుగా తీస్తే వాటిని రిలీజ్ కాకుండా అడ్డుకుంటున్నారు.
ఇదిలా ఉంటే తాజాగా తనిష్క్ జ్యూయిలరీ వారు ఒక యాడ్ రిలీజ్ చేశారు.అందులో ముస్లిం కుటుంబానికి కోడలుగా వెళ్ళిన హిందూ అమ్మాయికి ఆమె మత సంప్రదాయంలోనే శ్రీమంతం చేస్తారు.
ఈ కాన్సెప్ట్ ని మత సామరస్యానికి ప్రతీకగా ఎలివేట్ చేసి జ్యూయిలరీని ప్రమోట్ చేసుకోవాలని అనుకున్నారు.అయితే అది కాస్తా రివర్స్ కొట్టింది.
ఈ యాడ్ తో లవ్ జిహాద్ ని ప్రోత్సహిస్తున్నట్లు ఉందని సోషల్ మీడియాలో హిందుత్వ వాదులు, మతాభిమానులు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు.తనిష్క్ జ్యూయిలరీని బాయ్ కట్ చేయాలని కాంపైన్ చేశారు.
దీంతో జరగబోయే నష్టాన్ని గ్రహించిన జ్యూయిలరీ యాజమాన్యం ఆ యాడ్ ని తొలగించింది.