సినీ దర్శక, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ ఈ మధ్యకాలంలో సినిమాకి సంబందించిన విషయాల మీదనే కాకుండా సామాజిక, రాజకీయ అంశాలపై కూడా ఎక్కువగా మాట్లాడుతున్నారు.తన పేరు మీద ఉన్న యుట్యూబ్ చానల్ లో రాజకీయ అంశాలపై మాట్లాడుతూ తన అభిప్రాయాన్ని తెలియజేస్తూ ఉంటారు.
ఈ నేపధ్యంలోనే ఆయన చేసిన రాజకీయ వ్యాఖ్యలకి సోషల్ మీడియాలో ప్రాధాన్యత పెరుగుతుంది.ఇదిలా ఉంటే తాజాగా పలాస 1978 సినిమా ప్రచార కార్యక్రమంలో భాగంగా విశాఖ వచ్చిన ఆయన రాజధాని అంశంపై మాట్లాడారు.
జగన్ మూడు రాజధానులు కాకపోతే ముప్పై రాజధానులు అని పేర్లు పెట్టుకోవచ్చని ఎద్దేవా చేశారు.అయితే పాలన ఎక్కడి నుంచి జరిగితే అదే అసలైన రాజధాని అవుతుందని, పేర్లు పెట్టినంత మాత్రాన రాజధానులు కావని అన్నారు.
గత ఐదేళ్ళ కాలంలో అమరావతి రాజధాని అంటూ అక్కడ 7 వేల కోట్లు ప్రజాధనం ఖర్చు పెట్టారని మరో 2 వేల కోట్లు ఖర్చు చేస్తే ఎంతో కొంత పూర్తవుతుందని అన్నారు.ప్రభుత్వాలు మారినప్పుడల్లా రాజధానులు మార్చుకుంటూ పోతావుంటే ఏపీ అభివృద్ధి పూర్తిగా అటకెక్కినట్లే అని విమర్శించారు.
గత ప్రభుత్వం ప్రత్యేక హోదాపై పోరాటం చేసిన వాళ్ళని అరెస్ట్ చేసి ఇప్పుడు ప్రత్యేక హోదా అని మాట్లాడుతుందని, మరో వైపు మూడు రాజధానులు అంటూ ప్రస్తుత ప్రభుత్వం ప్రజలని గందరగోళం కి గురి చేస్తుందని అన్నారు.ప్రజల సమస్యల గురించి మాట్లాడాల్సిన చట్ట సభలలో నేతలు బూతులు తిట్టుకుంటున్నారని, వీటిని చూస్తున్న అందరూ తెలుగు ప్రజల అవమానకరంగా చూస్తున్నారని, ఇదంతా కేవలం అధికార, ప్రతిపక్షాల విపరీత ధోరణి కారణంగానే తలెత్తిందని విమర్శించారు.