తమిళనాడు సేలం జిల్లాలో దారుణ ఘటన జరిగింది.పొరుగువారే ఓ మహిళపై కత్తితో దాడి చేయగా.
ఆమె ఛాతిలో కత్తి గుచ్చుకుంది.అయితే ప్రాణభయంతో ఆస్పత్రిలో చేరిన ఆమె ఛాతి నుంచి 30 గంటల తర్వాత శస్త్రచికిత్స చేసి కత్తిని తొలగించారు కోయంబత్తూర్ వైద్య కళాశాల ఆస్పత్రి వైద్యులు.ప్రస్తుతం ఆమె సురక్షితంగా ఉన్నట్లు తెలిపారు.
ఇదీ జరిగింది .!
సేలం జిల్లాలోని క్రిష్ణగిరిలో హోసూర్ ప్రాంతానికి చెందిన ఓ మహిళపై మే 25 రాత్రి పొరుగువారే కత్తితో పొడిచి పారిపోయారు.ఆమె రాత్రంతా నరకవేదన అనుభవించి మే 26న (మరుసటి రోజు) సేలంలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో చేరారు.అయితే చికిత్స ఫలించకపోవడం వల్ల కోయంబత్తూర్లోని ఆస్పత్రికి వెళ్లాలని సూచించారు.
30 గంటలు నరకవేదన .!
సుమారు 30 గంటలు ప్రాణాలతో పోరాడిన తర్వాత, కార్డియోథొరాసిక్ సర్జరీ, అనస్థీషియాలజీ డాక్టర్లు మూడు గంటల పాటు తీవ్రంగా శ్రమించి శస్త్రచికిత్స చేసి కత్తిని తొలగించారు.ఆరు అంగుళాల కంటే ఎక్కువ లోతులోనే ఆమె శరీరంలో కత్తి దిగినట్లు వెల్లడించారు.
అదృష్టవశాత్తు ఆమె గుండెకు తాకకపోవడం వల్ల ప్రాణాపాయం నుంచి బయటపడిందని వైద్యులు తెలిపారు.ఆమె పూర్తిగా కోలుకున్న తర్వాత 3 రోజుల క్రితమే ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు.
అయితే ఈ విషయం కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.