రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు , దేశమంతా కరోనా వైరస్ ప్రభావం తీవ్రం అయింది.కేసుల సంఖ్య లక్షలు దాటుతోంది.
ప్రపంచంలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్న దేశాల్లో భారత్ రెండో స్థానంలో ఉంది.భారత్ లో నమోదవుతున్న కేసుల విషయంలో ప్రపంచ దేశాలు సైతం ఆందోళనలో ఉన్నాయి.
కరోనా వాక్సిన్ అందుబాటులోకి వచ్చిన తరువాత కూడా ఈ విధంగా కేసులు నమోదు అవుతున్న తీరు ఆందోళన కలిగిస్తోంది.ఇక కరోనా వైరస్ సోకిన బాధితుల్లో ఎక్కువ మంది ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ కారణంగా ఇబ్బంది పడుతున్నారు.
శ్వాస తీసుకోవడానికి ఇబ్బందిపడతూ, ఆక్సిజన్ పెడితేనే బతుకుతున్న పరిస్థితి నెలకొంది.దీంతో దేశవ్యాప్తంగా ఆక్సిజన్ కొరత తీర్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.
విదేశాల నుంచి ఆక్సిజన్ కంటైనర్లను తెప్పించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆక్సిజన్ కొరత కారణంగా ఎన్నో రాష్ట్రాల్లో ఎంతో మంది కరోనా పేషెంట్ లు మృత్యువాత పడిన సంఘటనలు అనేకం చూడాలి వచ్చింది.
ఇది ఇలా ఉంటే ఇప్పుడు ఈ ఆక్సిజన్ కొరత రాష్ట్రాల మధ్య చిచ్చు పెట్టే విధంగా కనిపిస్తోంది.దేశవ్యాప్తంగా ఆక్సిజన్ డిమాండ్ పెరిగిపోవడంతో, కేంద్రం ఆక్సిజన్ అవసరం ఉన్న రాష్ట్రాలు, ఇతర రాష్ట్రాల నుంచి తరలిస్తుంది.
ఇదే ఇప్పుడు వివాదానికి కారణం అవుతోంది.ఢిల్లీకి ఆక్సిజన్ సరఫరా కాకుండా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అడ్డుకుంటుంది అంటూ అరవింద్ కేజ్రీవాల్ ఆవేదన వ్యక్తం చేస్తున్న సమయంలోనే, తమిళనాడు సైతం ఆక్సిజన్ విషయంలో ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాసింది.
తమిళనాడు నుంచి ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల వెళ్తున్న 80 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ సరఫరా ను వెంటనే నిలిపివేయాలని కోరుతూ, తమిళనాడు ముఖ్యమంత్రి పళని స్వామి ప్రధాని నరేంద్ర మోదీ కి లేఖ రాశారు.
తమిళనాడులో కరోనా పాజిటివ్ కేసులు సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతున్నాయి.ఈ కొరత తీవ్రంగా వేధిస్తున్న ఇటువంటి సమయంలో, ఆంధ్ర – తెలంగాణ కు తమ రాష్ట్రంలో తయారవుతున్న ఆక్సిజన్ సరఫరా ను నిలిపి వేయాలని కోరారు. తమిళనాడులో 400 మెట్రిక్ టన్నుల మెడికల్ ఆక్సీజన్ తయారవుతుంది అని, తమ రాష్ట్రంలోనే 310 మెట్రిక్ టన్నులు ఖర్చవుతుందని, రానున్న రోజుల్లో 450 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ అవసరం అయ్యే అవకాశాలు ఉన్నాయని, ఇటువంటి కీలక సమయంలో తమ రాష్ట్రం నుంచి ఏపీ, తెలంగాణ కి వెళ్తున్న 80 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ సరఫరా ను నిలిపి వేసే విధంగా ఆదేశాలు ఇవ్వాలని పళనిస్వామి ప్రధాని కి రాసిన లేఖలో కోరారు.
ఇంకా అనేక అంశాల గురించి రాసిన లేక ఇప్పుడు కలకలం సృష్టిస్తోంది.ప్రస్తుతం ఈ వ్యవహారం రాష్ట్రాల మధ్య చిచ్చు రేపే విధంగా మారింది.అసలు ఆక్సీజన్ ఎక్కడ ఎక్కువ అవసరం ఉంటుందో అక్కడ కు ఆక్సిజన్ సరఫరా చేయాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందని, కానీ ఈ విధంగా మొత్తం తమకే కావాలి అన్నట్లు తమిళనాడు పట్టుబట్టడం ఇప్పుడున్న పరిస్థితుల్లో సరైంది కాదన్న వాదన వినిపిస్తోంది.