ఆఫ్ఘనిస్తాన్ను సంకీర్ణదళాలు పూర్తిగా ఖాళీ చేయడానికి కేవలం ఐదే రోజులు గడువుంది.ఎవరేం చేసినా ఈ ఐదు రోజుల్లోనే చేయాలి.
ఇప్పటికే ఆఫ్ఘన్ గడ్డపై పరిస్ధితులు ప్రమాదకరంగా మారుతున్నాయి.ఇక అన్నింటికి మించి బాంబు దాడులతో యావత్ ప్రపంచం ఉలిక్కిపడింది.
కాబూల్ ఎయిర్పోర్ట్లో దేశాన్ని వీడుతున్న ప్రజలను, విదేశీయులను లక్ష్యంగా చేసుకుని ముష్కరులు జరిపిన వరుస బాంబు పేలుళ్లలో 100 మందికి పైగా మరణించగా.అదే స్థాయిలో క్షతగాత్రులయ్యారు.
కాబూల్ ఎయిర్పోర్ట్పై దాడులు జరిగే అవకాశం వుందని అమెరికా, ఆస్ట్రేలియా, బ్రిటన్లు హెచ్చరించిన కొద్ది గంటల్లోనే ఈ దాడి జరగడం గమనార్హం.అయితే ఆగస్టు 31 తర్వాత కూడా ఆఫ్ఘాన్లోని పౌరులను, నాటో దళాలకు సాయం చేసిన వారిని తరలించేందుకు అమెరికా ప్రయత్నిస్తోందన్న వార్తల నేపథ్యంలో తాలిబన్లు ముందస్తు హెచ్చరికలు చేస్తున్నారు.
తద్వారా అసలు ముందు ముందు తాము ఏం చేయబోతున్నామనే దానిపై ట్రైలర్ వదిలారు.
తాలిబన్ల రాకతో ప్రపంచ శాంతికి ముప్పు వాటిల్లే అవకాశం వుందని నిపుణులు హెచ్చరిస్తున్న సంగతి తెలిసిందే.ముఖ్యంగా నామరూపాలు లేకుండా పోయిన ఒకప్పటి ఉగ్రవాద సంస్థ అల్ఖైదా.తాలిబన్ల అండతో మళ్లీ యాక్టీవ్ కావాలని చూస్తోంది.
అదే జరిగితే అమెరికా మిత్రదేశాలతో పాటు భారత్కు అది ముప్పుగా మారే అవకాశం వుంది.అలాగే పాకిస్తాన్లో వున్న అణ్వాయుధాలు ఈ తాలిబన్ల చేతికి చిక్కితే ఇంకేమైనా వుందా.? పిచ్చోడి చేతిలో రాయి మాదిరి అది ఏ క్షణంలో, ఎటు వైపు, ఎవరి మీద పడుతోందో చెప్పడం కష్టం.మిగిలిన వాటితో పోలిస్తే ఈ పరిణామం కొన్ని తరాలను చావు దెబ్బ తీస్తోంది.
అందుకే న్యూక్లియర్ ఆయుధాలు తాలిబన్ల చేతిలో పడకుండా.పాకిస్తాన్ను, తాలిబన్లను కట్టడి చేయాలని అమెరికాను పలువురు హెచ్చరిస్తున్నారు.
తాజాగా అమెరికా చట్టసభ సభ్యులు సైతం ఇదే సూచన చేశారు.ఈ మేరకు 68 మంది సభ్యులు అధ్యక్షుడు బైడెన్కు లేఖ రాశారు.
తాలిబన్లు ఆఫ్గాన్ భూభాగాన్ని చేజిక్కించుకున్న వేగం చూసి షాకైనట్లు సభ్యులు లేఖలో పేర్కొన్నారు.అక్కడ మిగిలిన సైనికులను కూడా ఉపసంహరించుకోవడం అమెరికా స్వయంకృతాపరాధంగా వారు అభివర్ణించారు.కానీ ఇప్పుడేమో సిబ్బంది తరలింపులో ఆలస్యం చేస్తున్నారని చట్టసభ సభ్యులు ఆక్షేపిస్తున్నారు. అణ్వాయుధ దేశమైన పాకిస్తాన్ను తాలిబన్లు అస్థిరపర్చకుండా మీ ప్లాన్లు ఏమిటీ.తాలిబన్ల నేతృత్వంలోని ఆఫ్ఘనిస్తాన్కు అణ్వాయుధాలు చిక్కకుండా చేయడానికి వ్యూహం ఏమిటీ.?’’ అని చట్టసభ సభ్యులు అధ్యక్షుడిని కోరారు.వారు ఈ లేఖ రాసిన గంటల వ్యవధిలోనే కాబూల్ విమానాశ్రయంలో పేలుళ్లు జరగడం గమనార్హం.