దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు డైరెక్షన్ లో మంచు మనోజ్ హీరోగా తెరకెక్కిన ఝమ్మంది నాదం సినిమాతో తెలుగుతెరకు పరిచయమైంది తాప్సీ.స్టార్ హీరోల సినిమాల్లో పెద్దగా ఆఫర్లు రాకపోయినా నటిగా తాప్సీకి మంచి గుర్తింపు దక్కింది.
అయితే తెలుగులో అవకాశాలు తగ్గడంతో బాలీవుడ్ ఇండస్ట్రీ వైపు దృష్టి పెట్టిన తాప్సీ సామాజిక అంశాల విషయంలో స్పందించడంతో పాటు వ్యక్తిగత అభిప్రాయాలను సోషల్ మీడియా వేదికగా వ్యక్తం చేస్తున్నారు.
తాజాగా సుప్రీంకోర్ట్ జడ్జ్ వేసిన ప్రశ్న గురించి తాప్సీ కీలక వ్యాఖ్యలు చేశారు.
మహారాష్ట్రలో ప్రభుత్వ ఉద్యోగిగా విధులు నిర్వహిస్తున్న ఒక వ్యక్తి ఐదు సంవత్సరాల క్రితం 16 సంవత్సరాల బాలికను అత్యాచారం చేసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు.ఆ నిందితుని వయస్సు ప్రస్తుతం 23 సంవత్సరాలు కాగా అత్యాచార ఆరోపణల నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం ఆ వ్యక్తిని విధుల నుంచి సస్పెండ్ చేసింది.
బాంబే హైకోర్టు ఆ వ్యక్తి బెయిల్ ను కూడా రద్దు చేయడంతో సదరు ఉద్యోగి తనను అరెస్ట్ చేయవద్దంటూ సుప్రీం కోర్టు మెట్లెక్కాడు.కేసు విచారణలో భాగంగా సుప్రీం కోర్టు అత్యాచారం చేసిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటావా.? అని ప్రశ్నించగా నిందితుని తరపు లాయర్ సమాధానం చెప్పటానికి కొంత సమయం కావాలని అన్నారు.సుప్రీం కోర్టు జడ్జి నిందితుడిని అడిగిన ప్రశ్న విషయంలో తాప్సీ అభ్యంతరం వ్యక్తం చేశారు.
అత్యాచారానికి గురైన బాలికను ఎవరైనా ఇదే ప్రశ్న అడిగారా.? అని ఆమె ప్రశ్నించారు.ఆ బాలిక రేప్ చేసిన వ్యక్తిని పెళ్లి చేసుకోవడం ఇష్టమో లేదో కనుక్కున్నారా.? జడ్జి వేసిన ప్రశ్న సమస్యకు పరిష్కారామా లేక శిక్షా.? అని తాప్సీ ప్రశ్నించారు.తాప్సీ వేసిన ప్రశ్నను నెటిజన్లు సమర్థిస్తున్నారు.
మరోవైపు నిన్న తాప్సీ ఇంటిపై ఐటీ దాడులు జరిగిన సంగతి తెలిసిందే.