కరోనా వైరస్ డెల్టా వేరియంట్ కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఆస్ట్రేలియా .ఇక నెలల తరబడి అంతర్జాతీయ సరిహద్దును మూసివేసి వుంచడం మంచిది కాదని భావిస్తోంది.
దీనిలో భాగంగా కఠినమైన కోవిడ్ నిబంధనలు అమలు చేసి సరిహద్దులు తెరవాలని యోచిస్తోంది.రెండు విడతల వ్యాక్సిన్ పూర్తయిన వారిని దేశంలోని అతిపెద్ద నగరమైన సిడ్నీకి అనుమతించాలని నిర్ణయించారు.
ఇందుకోసం నగరంలో కొత్త తరహా క్వారంటైన్ వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చారు. దీనిని అధికారులు ప్రయోగాత్మకంగా అమలుచేసిన తర్వాత ఫలితాలను బట్టి పూర్తిగా అందుబాటులోకి తీసుకొస్తారని ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్ తెలిపారు.
కోవిడ్ తీవ్రత నేపథ్యంలో 2020 మార్చిలో ఆస్ట్రేలియా ప్రభుత్వం అంతర్జాతీయ సరిహద్దును మూసివేసింది.కేవలం ఆస్ట్రేలియన్లు, శాశ్వత పౌరసత్వం వున్నవారినే అనుమతించింది.వీరు తమ సొంత ఖర్చులతో తప్పనిసరిగా రెండు వారాల పాటు హోటల్లో క్వారంటైన్లో వుండాల్సి వుంటుంది.ఈ క్రమంలో అంతర్జాతీయ సరిహద్దును తిరిగి తెరవడం తమ ప్రభుత్వ ప్రణాళికలో వుందన్నారు ప్రధాని మోరిసన్.
పరిస్ధితుల దృష్ట్యా కోవిడ్ 19తో సహజీవనం చేసే విధానానికి ట్రయల్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు.
దేశంలోని ఇతర నగరాలతో పోలిస్తే విదేశాల నుంచి తిరిగి వచ్చే వారు సిడ్నీలోనే ఎక్కువ.
ఈ నేపథ్యంలోనే సెప్టెంబర్ చివరి వారం నుంచి అంతర్జాతీయ ప్రయాణీకుల కోసం ఏడు రోజుల క్వారంటైన్ కార్యక్రమాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేయనున్నారు.ఆస్ట్రేలియా నివాసితులు, నాన్ రెసిడెంట్స్, కొందరు క్వాంటాస్ ఎయిర్ సిబ్బందితో సహా దాదాపు 175 మంది వ్యక్తులను క్వారంటైన్లో వుంచనున్నారు.
వారి ఆరోగ్య పరిస్ధితిని పర్యవేక్షించడానికి మొబైల్ ఫోన్ యాప్, ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీని ఉపయోగించనున్నారు.
మరోవైపు ఆస్ట్రేలియా ప్రభుత్వం ప్రత్యేక వీసాలను తెరపైకి తీసుకొచ్చింది.కోవిడ్ వల్ల ఆర్ధిక వ్యవస్ధ పతనం కావడంతో తిరిగి కోలుకోవడానికి వీలుగా నైపుణ్యం, ప్రతిభ వున్న విదేశీ ఉద్యోగులకు వీసాలు మంజూరు చేయాలని స్కాట్ మోరిసన్ సర్కార్ భావిస్తోంది.దీని వల్ల వచ్చే 10 నెలల్లో వందలాది మంది విదేశీ కార్మికులు ఆస్ట్రేలియాకు రావొచ్చని అంచనా.
“Post Covid-19 Economic Recovery Event”గా పిలుస్తున్న ఈ ప్రత్యేక వీసాల వల్ల ఆస్ట్రేలియాలో వ్యాపార, వాణిజ్య కార్యక్రమాలను తిరిగి ప్రారంభించాలని భావిస్తున్న వ్యూహం.మార్చి 2021లో వెలుగుచూసిన కోవిడ్ వల్ల కొన్ని కీలక పరిశ్రమలు, సేవలలో నైపుణ్యాల కొరత తీవ్రమైంది.
ఇదే సమయంలో వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఆస్ట్రేలియా పౌరులు కాని వారిని, సొంతపౌరులను సైతం దేశంలోకి ప్రవేశించకుండా ఆంక్షలు విధించారు ప్రధాని స్కాట్ మోరిసన్.కాగా, జూలై చివరి నాటికి దాదాపు 38000 మంది ఆస్ట్రేలియన్లు విదేశాలలో చిక్కుకుపోయారని అంచనా.