కరోనా వైరస్తో ఆస్ట్రేలియా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే.ఒక్కొక్క నగరం డెల్టా వేరియంట్ పడగ నీడలోకి వెళ్లిపోవడంతో గత్యంతరం లేని పరిస్ధితుల్లో లాక్డౌన్ విధించింది ఆస్ట్రేలియా ప్రభుత్వం.
ప్రజల నుంచి నిరసన వ్యక్తమైనా సరే సైన్యాన్ని రంగంలోకి దించి మరి కఠినంగా వ్యవహరించింది.వ్యాక్సినేషన్ను వేగవంతం చేయడంతో పాటు ఆంక్షల కారణంగా ఇప్పుడిప్పుడే అక్కడ పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకుంటున్నాయి.
ఈ నేపథ్యంలోనే దేశంలోనే అతిపెద్ద నగరమైన సిడ్నీలో 107 రోజుల లాక్డౌన్కు ముగింపు పలుకుతూ గత సోమవారం నుంచి ఆంక్షలు సడలించారు.దీంతో సిడ్నీ వాసులు రోడ్లపై సందడి చేస్తున్నారు.
రెస్టారెంట్స్, మాల్స్, వాణిజ్య సముదాయాలు తిరిగి వ్యాపార కార్యకలాపాలను ప్రారంభించాయి.
ఇదే సమయంలో అంతర్జాతీయ ప్రయాణీకులపైనా ఆస్ట్రేలియా కఠినంగా వ్యవహరించింది.
ప్రత్యేకించి భారతదేశంపై ఆస్ట్రేలియా కాస్త గడుసుగానే వ్యవహరించింది.ఇండియాలో కోవిడ్ సెకండ్ వేవ్ ఉవ్వెత్తున ఎగిసిపడిన సమయంలో భారత విమాన ప్రయాణాలపై నిషేధం విధిస్తున్నట్టు ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్ ప్రకటించారు.
భారత్ నుంచి రాకపోకలు సాగించడం ప్రమాదకరమని, ఐపీఎల్లో వున్న ఆస్ట్రేలియా క్రికెటర్లు, పౌరులు తక్షణమే స్వదేశానికి చేరుకోవాలని ఆయన సూచించారు.అక్కడి వరకు బాగానే వుంది కానీ.
నిషేధాన్ని భారతీయులతో పాటు స్వదేశీయులు ఉల్లంఘంచినా ఐదేళ్లు జైలు శిక్ష, 66 వేల ఆస్ట్రేలియా డాలర్లు జరిమానా విధిస్తామని హెచ్చరించడం వల్ల మోరిసన్ తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు.ఈ వివాదం నెమ్మదిగా సద్దుమణిగింది.
మరోవైపు దాదాపు 18 నెలల నుంచి అంతర్జాతీయ ప్రయాణాలపై ఆస్ట్రేలియా ప్రభుత్వం నిషేధం అమలు చేస్తున్న సంగతి తెలిసిందే.ఎప్పటికప్పుడు దీనిని ఎత్తివేయాలని భావిస్తున్నప్పటికీ .దేశంలో డెల్టా వేరియంట్ కారణంగా వీలుపడటం లేదు.ఈ క్రమంలో అంతర్జాతీయ ప్రయాణాలకు శుభవార్త చెప్పారు ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్.
వచ్చే నెల నుంచి ఆస్ట్రేలియన్లు విదేశాలకు వెళ్లవచ్చని ఆయన కొద్దిరోజుల క్రితం ప్రకటించారు.పౌరులు, శాశ్వత నివాసితుల కోసం అంతర్జాతీయ సరిహద్దును తిరిగి తెరిచే ప్రక్రియ ప్రారంభిస్తున్నట్లు చెప్పారు.
సిడ్నీలో లాక్డౌన్ ఎత్తివేయడంతో అక్కడి ప్రభుత్వం అంతర్జాతీయ ప్రయాణీకులపైనా ఆంక్షలు సడలించింది.క్వారంటైన్ అవసరం లేకుండా నవంబర్ 1 నుంచి విదేశాల నుంచి పూర్తిగా టీకాలు తీసుకున్న ప్రయాణీకులు నిరభ్యంతరంగా సిడ్నీకి రావొచ్చని శుక్రవారం తెలిపింది.
అయితే ఆస్ట్రేలియా వాసులకే తొలి ప్రాధాన్యతను ఇస్తామని న్యూసౌత్ వేల్స్ రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది.ఇక్కడ ఈ శనివారం నాటికి తొలి డోసు వ్యాక్సినేషన్ తీసుకున్న వారి సంఖ్య 80 శాతానికి చేరుకుంటుందని అంచనా.
తాజా నిర్ణయంతో ఆస్ట్రేలియాలలోని ఇతర రాష్ట్రాలల్లో, వివిధ దేశాలలో చిక్కుకుపోయిన సిడ్నీ వాసులు, అక్కడకు వివిధ పనుల నిమిత్తం వెళ్లాల్సిన వారు సిడ్నీకి తిరిగి వచ్చేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
కాగా.మార్చి 2020లో మోరిసన్ అంతర్జాతీయ సరిహద్దును మూసివేస్తున్నట్లు ప్రకటించారు.నాటి నుంచి పరిమిత సంఖ్యలో వ్యక్తులకు మాత్రమే వ్యాపారం, మానవతా దృక్పథంతోనే దేశం విడిచి వెళ్లేందుకు అనుమతి ఇచ్చింది ప్రభుత్వం.
పౌరులు, శాశ్వత నివాసితులు విదేశాల నుంచి తిరిగి రావడానికి అనుమతించబడ్డారు.అయితే వీరంతా తప్పనిసరిగా హోటల్లో వారి స్వంత ఖర్చులతో 14 రోజులు క్వారంటైన్లో వుండాలి.సినిమా, టీవీ నటులు.వ్యాపారవేత్తలకు మాత్రం ప్రభుత్వం కొన్ని మినహాయింపులు ఇచ్చింది.