సాధారణంగా మహిళలు గర్భం ధరించినప్పటి నుంచి తనకు పుట్టబోయే బిడ్డ గురించి ఎన్నో కలలు కంటూ ఉంటారు.పుట్టిన తర్వాత తన బిడ్డ బాగోగులు చూసుకుంటూ ఎల్లప్పుడూ వారికి అందుబాటులో ఉండి, వారి ప్రతి అవసరాన్ని తీరుస్తూ ఎంతో అపురూపంగా చూసుకుంటుంది.
కానీ ఇక్కడ ఒక తల్లి ప్రవర్తించిన తీరు తల్లి తనానికి మాయని మచ్చగా మారింది.తన కడుపున పుట్టిన బిడ్డ పట్ల ఎంతో క్రూరంగా ప్రవర్తించి ఎన్నో చిత్రహింసలకు గురిచేసింది.
ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా 28 సంవత్సరాల పాటు తన కొడుకును ఒక గదిలో బంధించిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది.పూర్తి వివరాల్లోకి వెళితే…
స్వీడన్ లో జరిగిన ఈ హృదయ విదారక ఘటనలో కన్నతల్లి కొడుకు పట్ల ఎంతో కఠినంగా ప్రవర్తించింది.28 సంవత్సరాల క్రితం 12 ఏళ్ల వయసున్న తన కొడుకును ఒక గదిలో బంధించి అమ్మతనానికి మాయని మచ్చగా పేరుగాంచింది.గత 28 సంవత్సరాల నుంచి అబ్బాయికి ఒకే గదిలోనే భోజనం, నిద్ర, బాత్రూం అన్ని ఆ గదిలోనే సాగాయి.28 సంవత్సరాల నుంచి ఆ గదిని ఒక్కసారిగా శుభ్రం చేయలేదు అంటేనే అర్థమవుతుంది ఆ తల్లి కొడుకు పట్ల ఎలా ప్రవర్తించిందో.
గత కొద్ది రోజులుగా ఆ మహిళ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ ఉంటే తనను చూడటానికి తను నివాసం ఉంటున్న అపార్ట్ మెంట్ కి తమ బంధువులు వచ్చారు.
అయితే అక్కడ దీనస్థితిలో ఉన్న తన కొడుకుని చూడగానే తన బంధువులు పోలీసులకు సమాచారాన్ని అందించారు.వెంటనే పోలీసులు అక్కడికి వచ్చి ఆ బాధితునికి సరైన చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.
అతడి దీనస్థితిని చూసి పలువురు కంటతడి పెట్టారు.అయితే అతని ఆరోగ్యానికి ఎటువంటి ప్రమాదం లేదని వైద్యులు తెలియజేశారు.
మానసికంగా కోలుకోవడానికి కొంత సమయం పడుతుందని డాక్టర్లు తెలియజేశారు.
అయితే ఈ ఘటనపై పోలీసులు స్థానికులను అడిగి సమాచారం తెలుసుకోగా, ఆ మహిళను తన కొడుకు గురించి అడిగితే స్థానికులపై తీవ్రంగా విరుచుకుపడే దని, నా కొడుకు గురించి మీకెందుకు అంటూ ఎదురు ప్రశ్నలు వేసేదని,తమ ఇంటి వైపు ఒక్కరిని కూడా రానిచ్చేది కాదని స్థానికులు పోలీసులకు తెలియజేశారు.
అయితే కొడుకు పట్ల అలా ప్రవర్తించినందుకు ఆమెపై కేసు నమోదు చేసుకుని పోలీసులు మహిళను అరెస్టు చేశారు.