2022వ సంవత్సరానికి మెడిసిన్ విభాగంలో విశేష కృషి చేసినందుకుగానూ స్వీడన్ జెనెటిస్ట్ స్వాంటె పాబోకు ప్రతిష్టాత్మక నోబెల్ బహుమతి తాజాగా వరించింది.ఈ మేరకు నోబెల్ కమిటీ తాజాగా ఓ ప్రకటన విడుదల చేసింది.
మానవ పరిణామక్రమంతో పాటు అంతరించిపోయిన హోమినిన్ జన్యువులకు సంబంధించిన ఆవిష్కరణలకుగానూ పాబోను ఈ బహుమతికి ఎంపిక చేశారు.స్వీడన్లోని స్టాక్హోంలో ఉన్న కరోలిన్స్కా ఇన్స్టిట్యూట్లోని నోబెల్ బృంధం ఈ మేరకు సోమవారం ప్రకటించింది.
ఈ ఏడాదికి నోబెల్ బహుమతులకు ఎంపికైన వారిలో జెనెటిస్ట్ స్వాంటె మొదటి వ్యక్తి కావడం విశేషం.
ఇకపోతే గతేడాది ఉష్ణ గ్రాహకాలు, శరీర స్వర్శపై చేసిన పరిశోధనలకు అమెరికాకు చెందిన డేవిడ్ జూలియస్, అర్డెమ్ పటాపౌటియన్లకు వైద్య విభాగంలో నోబెల్ బహుమతి అందుకున్నారు.
వైద్యవిభాగంతో మొదలైన నోబెల్ పురస్కారాల ప్రదానం వారంపాటు కొనసాగనుంది.వైజ్ఞానిక ప్రపంచంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన నోబెల్ బహుమతులకు ఇతర విభాగాల్లో విజేతలను మంగళవారం భౌతికశాస్త్రం, బుధవారం రసాయనశాస్త్రం, గురువారం రోజున సాహిత్యం, శుక్రవారం రోజున 2022 నోబెల్ శాంతి బహుమతి, అక్టోబర్ 10న అర్థశాస్త్రం విభాగాల్లో పురస్కార గ్రహీతల పేర్లను ప్రకటించనున్నారు.
ప్రముఖ స్వీడిష్ బయోకెమిస్ట్ సునే బెర్గ్స్ట్రోమ్ కుమారుడు స్వాంటె పాబో. 1955లో స్వీడన్లోని స్టాక్హోమ్లో జన్మించిన స్వాంటే పాబో ప్రస్తుతం లీప్జిగ్లోని మాక్స్ ప్లాంక్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఎవల్యూషనరీ ఆంత్రోపాలజీలో డైరెక్టర్గా పని చేస్తున్నారు.ఉప్ప్సల యూనివర్సిటీ నుంచి వైద్య విద్యాను పూర్తి చేసాడు.1980లో సెల్ బయాలజీ, ఉప్ప్సల, రోచె ఇన్స్టిట్యూట్ ఫర్ మాలిక్యులర్ బయాలజీలో పార్ట్ టైం రీసెర్చ్, టీచింగ్ ప్రారంభించారు.1986లో పీహెచ్డీ పూర్తి చేశారు.స్వాంటె పాబో తండ్రి అయిన సునే బెర్గ్స్ట్రోమ్ కూడా నోబెల్ గ్రహీత కావడం విశేషం.
అవును.సునే బెర్గ్స్ట్రోమ్ 1982లో వైద్య విభాగంలోనే ప్రతిష్టాత్మక నోబెల్ బహుమతి పొందారు.