తెలుగు, తమిళంతో పాటు పలు భాష చిత్రాలకు మాటల రచయితగా వ్యవహరించిన ప్రముఖ రచయిత గణేష్ పాత్రో నేడు ఉదయం చెన్నైలో తుది శ్వాస విడిచారు.గత కొంత కాలంగా క్యాన్సర్తో బాధపడుతూ ఉన్నాడు.చెన్నైలోని ఒక హాస్పిటల్లో గణేష్ పాత్రో చికిత్స పొందుతూ మరణించాడు.1945లో జన్మించిన గణేష్ గారు 20 సంవత్సరాల వయస్సు నుండే రచయితగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.
తమిళంలో బాలచందర్ దర్శకత్వం వహించిన ఎన్నో సినిమాలకు మాటల రచయితగా వ్యవహరించారు.తెలుగులో ‘అత్తారిల్లు’ అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు.ఆ తర్వాత పలు తెలుగు సినిమాలకు తన సాహిత్యాన్ని అందించి తెలుగు ప్రేక్షకులను మెప్పించాడు.ఈయన చివరిగా తెలుగులో తెరకెక్కిన భారీ మల్టీస్టారర్ సినిమా ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ చిత్రానికి తన సాహిత్యాన్ని అందించాడు.
కుటుంబ కథలకు సరైన సాహిత్యం అందించడంలో గణేష్ పాత్రో గారిది అందెవేసిన కలం అంటూ ఉంటారు.గణేష్ పాత్రోగారి మరణంతో ఆయన అభిమానులు మరియు సినీ లోకం కూడా తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేస్తోంది.
ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుందాం.