మాజీ కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్ కన్నుమూశారు.గత కొంత కాలంగా అనారోగ్యం తో బాధపడుతున్న తెలంగాణా చిన్నమ్మ ఢిల్లీ లోని ఎయిమ్స్ లో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తుంది.
సుష్మాస్వరాజ్.పార్టీలకు అతీతంగా దేశమంతా గౌరవించదగిన గొప్ప రాజకీయ నేత.ఒక్క మెస్సేజ్ తోనే ప్రపంచం నలుమూలల ఉన్న భారత ప్రజల కష్టాలను తీర్చే ఏకైక వీరవనిత సుష్మాస్వరాజ్.అందుకే ఆమెను అందరూ ముద్దుగా ‘సూపర్ మామ్’ అఫ్ ఇండియా అని పిలుచుకుంటారు.67 ఏళ్ల సుష్మా స్వరాజ్ లేరన్న విషయం ఒక్క బీజేపీ పార్టీ కే కాదు యావత్ దేశానికే తీరని లోటు అని చెప్పాలి.
మాజీ సుప్రీం కోర్ట్ లాయర్ అయిన సుష్మాస్వరాజ్ 1952, ఫిబ్రవరి 14న అంబాలాలో జన్మించారు.ఆమె తండ్రిగారు ఆర్ఎస్ఎస్ లీడర్ కావడం వల్ల సుష్మా పూర్తిగా రాజకీయ వాతారణంలో పెరిగారు.పంజాబ్ విశ్వవిద్యాలయం నుంచి న్యాయశాస్త్రంలో పట్టా పొందిన ఆమె 1970లలోనే ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా విద్యార్థి నాయకురాలిగా ఉద్యమం నడిపారు.1975లో స్వరాజ్ కౌశల్ అనే ప్రముఖ న్యాయవాదితో సుష్మాస్వరాజ్ పెళ్లి జరిగింది.ఇక 1990- 93 వరకు మిజోరాం రాష్ట్రానికి యువ గవర్నర్గా స్వరాజ్ కౌశల్ బాధ్యతలు చేపట్టారు.
అనంతరం 1977లో సుష్మాస్వరాజ్ తన రాజకీయ ప్రస్థానాన్ని మొదలు పెట్టగా, 25 సంవత్సరాలకే హర్యానాకు కేబినెట్ మినిస్టర్గా ఎన్నికై చరిత్ర సృష్టించారు.ఆ తర్వాత 1984లో బీజేపీలో చేరిన ఆమె మొదట పార్టీ సెక్రటరీగా పని చేసినప్పటికీ ఆమెలోని నాయకురాలి లక్షణాలు మెండుగా ఉండడంతో పార్టీ ఆమెను జనరల్ సెక్రటరీగా అపాయింట్ చేసింది.40 ఏళ్ళ సుష్మాస్వరాజ్ రాజకీయ జీవితంలో ఎన్నో అద్భుతమైన మర్చిపోలేని ఘట్టాలు చోటుచేసుకున్నాయి.ఢిల్లీకి మొదటి మహిళా ముఖ్యమంత్రి కూడా సుష్మాస్వారాజే కావడం విశేషం.
ఇలా ఆమె రాజకీయ జీవితం గురించి చూసుకుంటే అన్నీ రికార్డులతోనే నిండిపోయింది.ఆమె చివరిసారిగా కశ్మీర్ విభజనపై స్పందిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలుపుతూ ట్వీట్ చేశారు.
తన జీవితకాలంలో ఇటువంటి రోజు కోసమే ఎదురు చూస్తున్నట్లు పేర్కొన్నారు.అనారోగ్యం కారణంగానే గడిచిన సార్వత్రిక ఎన్నికల్లో సుష్మా స్వరాజ్ పోటీ చేయని సంగతి తెలిసిందే.
ఇంత మంచి నేత ఇలా హఠాన్మరణం పొందడాన్ని యావత్ భారత దేశమే కాకుండా ప్రపంచ దేశాలు కూడా దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నాయి.