ప్రస్తుతం ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ కారణంగా దేశవ్యాప్తంగా లాక్డౌన్ అమలులో ఉంది.ఈ కారణంగా అన్ని రంగాలు మూతపడ్డాయి.
ప్రజలు ఇళ్లకే పరిమితం అయ్యారు.అటు సినిమా రంగానికి చెందిన అన్ని పనులు కూడా నిలిచిపోయాయి.
సినిమా షూటింగ్లు మొదలుకొని థియేటర్ల వరకు అన్ని మూతపడ్డాయి. కాగా తొలుత లాక్డౌన్ను ఏప్రిల్ 14 వరకు విధిస్తున్నట్లు ప్రధాని మోదీ ప్రకటించినా, పెరుగుతున్న కరోనా వైరస్ పాజిటివ్ కేసులను దృష్టిలో పెట్టుకుని ఈ లాక్డౌన్ను మే 3వ తేదీ వరకు పొడిగించారు.
కాగా సినిమా రంగానికి చెందిన పలువురు ఈ లాక్డౌన్ కారణంగా ఇండస్ట్రీకి తీవ్ర నష్టం వాటిల్లిందని, అయినా ప్రజల ఆరోగ్యం కంటే ఏదీ గొప్పది కాదని అంటున్నారు.ఈ క్రమంలో లాక్డౌన్ తరువాత కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలని వారు అంటున్నారు.
ప్రముఖ నిర్మాత డి.సురేష్ బాబు ఈ విషయంపై తాజాగా స్పందించారు.
లాక్డౌన్ తరువాత షూటింగ్లు మొదలైనా, సినిమా థియేటర్లు మరో రెండు నెలల పాటు మూసివేస్తే మంచిదని అన్నారు.కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడమే శ్రేయస్కరమని ఆయన అన్నారు.
మరి సురేష్ బాబు మాటలకు థియేటర్ల యాజమాన్యాలు ఎలా స్పందిస్తాయో చూడాలి.