టాటా సన్స్ పిటీషన్ పై సుప్రీంకోర్టు అనుకూలంగా తీర్పు వెల్లడించింది.సైరస్ మిస్త్రీ ని మళ్లీ కంపెనీ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ గా నియమిస్తూ ఎన్ సీ ఎల్ ఏటీ ఇచ్చిన ఉత్తర్వుల విషయంలో టాటాసన్స్ పిటీషన్ దాఖలు చేయడం తో విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు తాజాగా స్టే విధించింది.
దీనితో టాటా సన్స్ ప్రైవేట్ లిమిటెడ్ (టీఎ్సపీఎల్) కేసులో టాటాలకు ఓదార్పు లభించింది.మిస్త్రీ కోరక పోయినా, ఆయన్ని టీ ఎస్పీ ఎల్ చైర్మన్గా పునర్ నియమిస్తూ ఎన్సీఎల్ఏటీ ఉత్తర్వులు ఇవ్వడాన్ని సర్వోన్నత న్యాయస్థానం తప్పు పట్టింది.
ఈ ఉత్తర్వుల్లో లోపాలు ఉన్నట్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బాబ్డె, జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ సూర్య కాంత్లతో కూడిన ధర్మాసనం తప్పు పట్టింది.ఈ కేసును పూర్తి స్థాయిలో వినాల్సి ఉన్నందున ప్రస్తుతానికి ఎన్సీఎల్ఏటీ ఉత్తర్వులపై స్టే ఇస్తున్నట్టు ప్రకటించింది.
ధర్మాసనం కేసు విచారణను నాలుగు వారాల పాటు వాయిదా వేసింది.టాటా సన్స్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ పదవి నుంచి సైరస్ మిస్త్రీని అర్ధాంతరంగా తొలగించిన విషయం తెలిసిందే.
దీనితో సైరస్ మిస్త్రీ, ఆయన కుటుంబ నిర్వహణలోని ఇన్వెస్ట్ మెంట్ కంపెనీలు ఎన్సీఎల్టీలో సవాల్ చేశాయి.అక్కడ తీర్పు మిస్త్రీకి ప్రతికూలంగా రావడం తో మిస్త్రీ ఎన్సీఎల్ఏటీలో అప్పీల్ చేయడం తో గత నెల 18 న మిస్త్రీని మళ్లీ టాటా సన్స్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా నియమించాలని ఆదేశాలు జారీ చేసింది.
టాటా సన్స్ లిమిటెడ్ కంపెనీని ప్రైవేట్ కంపెనీగా మార్చడాన్ని, చంద్రశేఖరన్ను టాటా సన్స్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా నియమించడాన్నీ ఎన్సీఎల్ఏటీ కొట్టి వేస్తూ తిరిగి మిస్త్రీ కి పట్టాలు అందించింది.దీంతో టాటా సన్స్ సుప్రీం కోర్టును ఆశ్రయించడం తో సుప్రీంకోర్టు ఆ ఉత్తర్వులపై స్టే విధించింది.