తమిళనాడు రాజకీయాలకి, సినిమాలకి మధ్య ఎప్పుడు అనుబంధం ఉంటుంది.అక్కడి సినిమా వాళ్ళే రాజకీయాలలో కీలక వ్యక్తులుగా మారారు.
ఎంజీఆర్, జయలలిత, కరుణానిధి లాంటి సినీ సెలబ్రెటీలు ఇప్పటి వరకు తమిళనాడు రాజకీయాలలో కీలక నాయకులుగా వెలుగొందారు.వారు పేర్లు తప్ప అక్కడ రాజకీయాలలో వేరొక పేర్లు వినిపించవు.
అయితే మొన్నటి వరకు తమిళ రాజకీయాలని శాసించిన జయలలిత, కరుణానిధి చనిపోవడంతో వారి శకం ముగిసిపోయింది.ఇప్పుడు వారి పార్టీలు రెండూ ఒకటి వారసత్వంతో కొనసాగితే, ఇంకొకటి ఆధిపత్య పోరు మధ్య నలిగిపోతుంది.
మరో ఎనిమిది నెలల్లో తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు మొదలవుతాయి.ఇలాంటి సమయంలో తమిళ రాజకీయాలలో ఉన్న నాయకత్వ శూన్యతని కోలీవుడ్ స్టార్స్ తమకి అనుకూలంగా మార్చుకోవడానికి రెడీ అవుతున్నారు.
అందులో భాగంగా ఇప్పటికే కమల్ హాసన్ పార్టీ పెట్టి ప్రజల్లోకి వెళ్లిపోయారు.అతని కార్యాచరణ, విధి విధానాలు ఎలా ఉంటాయి అనేదానిపై ఆ పార్టీ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది.
ఇక తమిళనాడు రాజకీయాలని పూర్తిగా శాసించే శక్తి ఉన్న మరొక స్టార్ రజినీకాంత్.ఇతను కూడా ఇప్పటికే రాజకీయాలలోకి వచ్చేశారు.ఒక పార్టీ పెట్టడం తప్పితే రాజకీయంగా భవిష్యత్తు కార్యాచరణ అంతా సిద్ధం చేసుకున్నారు.తన అభిమానులనే క్యాడర్ గా మార్చేసి పార్టీ ఏర్పాటుకి, ఎన్నికలకి ముందే గ్రౌండ్ సిద్ధం చేసుకుంటున్నారు.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ముందు పార్టీ పెడతానని రజినీకాంత్ గతంలోనే ప్రకటించారు.ఇక రజినీకాంత్ పార్టీ పెడితే అందులో చేరడానికి చాలా మంది సిద్ధంగా ఉన్నారు.
అయితే రజినీకాంత్ స్థానికుడు కాదనే విమర్శ ఉండటంతో అతని మీద ఒక వర్గం వ్యతిరేక ప్రచారం మొదలు పెట్టింది.అయితే తాను పార్టీ పెట్టి గెలిచినా ముఖ్యమంత్రిగా ఉండనని, సమర్ధవంతమైన వ్యక్తిని ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పడం ద్వారా తమిళ రాజకీయాలలో తన ముద్ర ఉండేలా చూసుకున్నారు.
ఈ నేపధ్యంలో నవంబర్ లో రజినీకాంత్ కొత్త పార్టీ ఎనౌన్స్ చేయబోతున్నారు అంటూ రజినీ మక్కల్ మండ్రంకి చెందిన ఒక నాయకుడు తెలియజేశాడు.జయలలిత, కరుణానిధి స్థానం రజినీకాంత్ తోనే భర్తీ అవుతుందని అన్నారు.
మరి ఇది ఎంత వరకు వాస్తవ రూపంలోకి వస్తుంది అనేది చూడాలి.
.