ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ ఎప్పుడు, ఎలా, ఎవరికి సోకుతుందో అర్థంగాక ప్రజలు తలలు పట్టుకున్నారు.ఇప్పటికే రోజూ వేల సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతుండటంతో ఈ మహమ్మారి బారిన పడకుండా ప్రజలు తీవ్ర జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
అయినా కొందరు మాత్రం ఈ వైరస్ బారిన పడి ప్రాణాల కోసం పోరాటం చేస్తున్నారు.తాజాగా ఒకప్పటి హీరోయిన్ సుమలతకు కరోనా పాజిటివ్ అని తేలింది.
మాండ్యా నియోజకవర్గం ఎంపీగా ఇండిపెండెంట్గా గెలిచిన సుమలత శనివారం నాడు గొంతు నొప్పి, తలనొప్పితో బాధపడింది.దీంతో డాక్టర్లు ఆమెకు కరోనా పరీక్ష చేయగా తాజాగా ఆమె రిపోర్ట్ పాజిటివ్గా వచ్చింది.
ఈ విషయాన్ని ఆమె స్వయంగా సోషల్ మీడియాలో వెల్లడించింది.తాను సోమవారం నుండి హోం క్వారంటైన్లో ఉండబోతున్నట్లు, తనను కలిసేందుకు ఎవరూ రావద్దని ఆమె ఈ సందర్భంగా కోరింది.
ఇక ఒకప్పుడు చిరంజీవి సరసన నటించి మెప్పించిన సుమలత, కన్నడ నటుడు అంబరీశ్ను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.కాగా 2018లో అంబరీష్ మృతి చెందడంతో ప్రస్తుతం సుమలత మాండ్యా ఎంపీగా వ్యవహరిస్తోంది.
ఇక సుమలత కరోనా వైరస్ నుండి వీలైనంత త్వరగా కోలుకోవాలని ఆమె సన్నిహితులు కోరుతున్నారు.