తోటి ఉద్యోగిని పొడిచి చంపిన కేసులో భారత సంతతి బిల్డర్కు యూకే కోర్టు సోమవారం యావజ్జీవ శిక్షను విధించింది.వివరాల్లోకి వెళితే….
లీసెస్టర్ నగరంలోని ఓ ప్రాంతంలో ఓ భవంతి పునర్నిర్మాణ పనుల్లో సులాఖాన్ సింగ్, సుఖ్వీందర్ సింగ్ పనిచేస్తున్నారు.
ఈ క్రమంలో జూలై 2న ఇద్దరి మధ్య ఓ విషయంలో వాగ్వాదం జరిగింది.
ఆ వివాదం సద్దమణిగిన తర్వాత కాలినడకన ఇంటికి వెళ్తున్న సుఖ్వీందర్ను సులాఖాన్ పొడిచాడు.వెంటనే స్పందించిన తోటి ఉద్యోగులు లీసెస్టర్ షైర్ పోలీసులతో పాటు ఈస్ట్ మిడ్లాండ్ అంబులెన్స్ సర్వీస్లకు సమాచారం అందించారు.
అనంతరం సుఖ్వీందర్ను లీసెస్టర్ రాయల్ హాస్పిటల్కు తీసుకెళ్లగా… అప్పటికే అతను మరణించినట్లు వైద్యులు తెలిపారు.దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
విషయం తెలుసుకున్న సులాఖాన్ పారిపోయాడు.కానీ గంటల వ్యవధిలోనే పోలీసులు అతనిని అదుపులోకి తీసుకున్నారు.సులఖాన్ సింగ్ ఉద్దేశ్యపూర్వకంగానే సుఖ్వీందర్ సింగ్ను హత్య చేసినట్లు లీసెస్టర్ క్రౌన్ కోర్టు గతవారం దోషిగా తేల్చింది.అనంతరం సోమవారం సులఖాన్కు జీవిత ఖైదుని విధిస్తూ తీర్పునిచ్చింది.
దానితో పాటు పెరోల్కు అర్హత సాధించడానికి కనీసం 22 సంవత్సరాల పాటు పనిచేయాల్సి ఉంటుందని కోర్టు తెలిపింది.దీనికి అదనంగా కత్తిని కలిగివున్న నేరానికి మూడున్నర సంవత్సరాల జైలు శిక్ష కూడా విధించింది.
ఈ తీర్పుపై భారత్లోని సుఖ్వీందర్ కుటుంబసభ్యులు ఒక ప్రకటన విడుదల చేశారు.అతను ఇంగ్లాండ్ వెళ్లడంతో తామంతా చాలా సంతోషించామన్నారు.
కొద్దిరోజుల్లో తమను చూసేందుకు భారతదేశానికి వచ్చేందుకు ప్రణాళికలు వేసుకుంటున్నాడని.కానీ అది ఎప్పటికీ జరగదని వారు ఆవేదన వ్యక్తం చేశారు.