టీడీపీ ప్రభుత్వ హయాంలో బీజేపీతో పొత్తు కారణంగా మంత్రి పదవి సొంతం చేసుకొని టీడీపీలో కీలక నేతగా తనదైన భూమిక పోషించిన నేత సుజనా చౌదరి.చంద్రబాబుకి అత్యంత సన్నిహితులుగా ముద్ర వేసుకున్న సుజనా చౌదరి, సిఏం రమేష్ కారణంగానే వైసీపీ నేతలు టీడీపీలోకి వచ్చారు.
తాజాగా జరిగిన ఎన్నికలలో టీడీపీ ఓటమి తర్వాత తమ స్వార్ధ ప్రయోజనాల కోసం టీడీపీని వీడి బీజేపీలోకి సుజనా చౌదరి చేరిపోయారు.బీజేపీలోకి వెళ్ళిన తర్వాత సుజనా చౌదరి టీడీపీ మీద పెద్దగా విమర్శలు చేయకపోయిన మొదటి సారి విజయవాడలో తల్లి పార్టీ మీద సంచలన ఆరోపణలు చేసారు.
టీడీపీ ధర్మ పోరాట దీక్ష పేరుతో అధర్మ పోరాట దీక్షలు చేసిందని, ప్రజాస్వామ్య దేశంలో అన్ని రాష్ట్రాలని కేంద్రం సమానంగా చూస్తుంది అనే ఆలోచన మరిచిపోయి చంద్రబాబు నాయుడు ధర్మ పోరాట దీక్షలు అంటూ ప్రజాధనం దుర్వినియోగం చేసారని విమర్శించారు.ఇదిలా ఉంటే సుజనా చౌదరి చేసిన ఈ వాఖ్యలు ఏపీ రాజకీయాలలో ఆసక్తికరంగా మారాయి.
మొన్నటి వరకు టీడీపీలో ఉండి బీజేపీ ఏపీకి తీవ్ర అన్యాయం చేసింది అని గగ్గోలు పెట్టిన వాళ్ళు ఇప్పుడు బీజేపీలోకి వెళ్ళగానే తాము, బాబుతో కలిసి చేసిన పనులు అన్ని అధర్మం అని అనడం చూస్తూ ఉంటే హాస్యాస్పదంగా ఉందని కామెంట్స్ చేస్తున్నారు.మొత్తానికి చంద్రబాబు నాయుడు ఎవరిని అయితే గుడ్డిగా నమ్మారో ఇప్పుడు వాళ్ళే పార్టీని నాశనం చేసే ప్రయత్నం మొదలుపెట్టారని చెప్పుకుంటున్నారు.