దర్శకురాలిగా కెరియర్ స్టార్ట్ చేసింది తెలుగులోనే అయినా తరువాత బాలీవుడ్ కి వెళ్లి అక్కడ సక్సెస్ అయ్యి తమిళంలో మాధవన్, రితికా సింగ్ తో ఇరుద్ది సుట్రు సినిమాతో ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించిన దర్శకురాలు సుధా కొంగర.ఇదే సినిమాని వెంకటేష్ తో తెలుగులో గురుగా రీమేక్ చేసి ఇక్కడ కూడా హిట్ కొట్టింది.
అయితే తెలుగు హీరోల నుంచి చాన్సులు వచ్చిన కూడా కమర్షియల్ హంగులు పేరుతో కథలో వేలు పెడతారని, దర్శకత్వంలో ఫ్రీడమ్ ఉండదని భావించిన సుధా కొంగర మరల కోలీవుడ్ వెళ్ళిపోయి అక్కడ హీరో సూర్యతో ఆకాశం నీ హద్దురా అనే సినిమాని తెరకెక్కించింది.ఈ సినిమా రియల్ బిజినెస్ మెన్ బయోపిక్ అనే విషయం చాలా ఆలస్యంగా బయటకి వచ్చింది.
ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని ఎప్పుడో రిలీజ్ కి రెడీ అయ్యింది.త్వరలో ఓటీటీ ద్వారా ఈ సినిమా విడుదల కాబోతుంది.
ఈ సినిమా తర్వాత ఆమె మళ్ళీ తమిళంలోనే సినిమా చేయబోతుంది.అది కూడా స్టార్ హీరో అజిత్ తో.ఇప్పటికే ఆమె అజిత్ కి ఓ కథ చెప్పి ఒకే చేయించుకుంది.ఈ సినిమాని ప్రముఖ నిర్మాత గోకులం గోపాలన్ నిర్మిస్తున్నారు.
ఈ కథ కూడా చాలా రియలిస్టిక్ గా ఉండే విధంగా సుధా ప్లాన్ చేస్తున్నారు.భారీ బడ్జెట్ తో ఈ సినిమా ద్విభాషా చిత్రంగా తెరకెక్కించడానికి దర్శకురాలు సుధా ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తుంది.
ప్రస్తుతం అజిత్ వినోద్ దర్శకత్వం వాలిమై సినిమాలో నటిస్తున్నాడు.ఈ సినిమా పూర్తికాగానే సుధా కొంగర సినిమా సెట్స్ పైకి వెళ్తుందని తెలుస్తుంది.
త్వరలో ఈ సినిమాకి సంబంధించి అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.