భారత్ ను, తెలుగు రాష్ట్రాలను కరోనా మహమ్మారి గజగజా వణికిస్తోంది.కరోనా బాధితుల సంఖ్య, మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.
కరోనా మహమ్మారి ప్రజలను తీవ్ర భయాందోళనకు గురి చేస్తోంది.ఇదే సమయంలో తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం పెద్ద పోచారం గ్రామంలో వరుస మరణాలు సంభవిస్తున్నాయి.
ఆరోగ్యంగా ఉన్నవాళ్లు అకస్మాత్తుగా చనిపోతూ ఉండటంతో గ్రామస్థులకు ఏం చేయాలో పాలుపోవడం లేదు.
గ్రామంలోని చాలామంది కారణం తెలియకుండానే కన్నుమూస్తున్నారు.
గ్రామంలో ఎక్కువ సంఖ్యలో ప్రజలు జ్వరంతో బాధ పడుతున్నారు.కరోనా వైరస్ సోకినా ఇక్కడి ప్రజలకు సకాలంలో చికిత్స అందకపోవడం వల్లే చనిపోతున్నారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
కోవిడ్ మొబైల్ వైద్య బృందాలు ఈ గ్రామానికి వచ్చి కరోనా పరీక్షలు నిర్వహిస్తే మాత్రమే ప్రజలు కరోనాతో చనిపోతున్నారో లేక ఇతర వ్యాధుల బారిన పడి చనిపోతున్నారో తెలిసే అవకాశం ఉంది.
సెప్టెంబర్ 15వ తేదీ నుంచి ఈ నెల 6వ తేదీ వరకు ఆ గ్రామంలో 12 మంది చనిపోయారు.12 మంది మృతి చెందినా అధికారులు ఈ గ్రామం వైపు కన్నెత్తైనా చూడకపోవడం గమనార్హం.గ్రామస్తులు ఎందుకు చనిపోతున్నారో కారణం తెలిస్తే చికిత్స చేయించుకోవడం సాధ్యమవుతుందని చెబుతున్నారు.
కరోనా లక్షణాల్లో జ్వరం కూడా ఒకటి కావడంతో చాలామంది జ్వరం వచ్చినా సొంతంగా చికిత్స చేయించుకుంటున్నారని తెలుపుతున్నారు.
గ్రామస్థులు రాష్ట్రమంతా కరోనా వైరస్ కట్టడి కోసం ప్రభుత్వం చర్యలు చేపడుతోందని తమ గ్రామం విషయంలో మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపణలు చేస్తున్నారు.
గ్రామపెద్దలు గ్రామంలో జ్వరం వచ్చిన వాళ్లకు ప్రభుత్వ వైద్యం అందడం లేదని తెలుపుతున్నారు. వైద్య, ఆరోగ్య శాఖ నిర్లక్ష్యంపై గ్రామ ప్రజలు తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు.
అధికారులు నిర్లక్ష్యం వహిస్తే మరి కొంతమంది ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.