ప్రస్తుతం యావత్ భారతదేశంలో ఉల్లి లొల్లి పెట్టిస్తోంది.ఇప్పటికే ఉల్లి ధర కిలోకు రూ.150 పలుకుతుండగా కొన్ని రాష్ట్రాల్లో ఏకంగా అంతకంటే ఎక్కువ ధర పలుకుతోంది.దీంతో పలు రాష్ట్రాల ప్రభుత్వాలు దిద్దుబాటు చర్యలు ప్రారంభించాయి.
ఇప్పటికే సబ్సిడీపై ప్రత్యేక కౌంటర్ల ద్వారా ప్రభుత్వం ఉల్లిని ప్రజలకు అందిస్తోంది.
కాగా ఏపీ ప్రభుత్వం కూడా సబ్సిడీపై ఉల్లిని అందించనున్నట్లు తెలిపింది.
ఈ మేరకు ప్రత్యేక కౌంటర్ల కూడా ఏర్పాటు చేసింది.అయితే విశాఖలోని ఎంవీపీ రైతు బజార్లో ఉల్లిని సబ్సిడీ ద్వారా అందిస్తుండగా తొక్కిసలాట చోటు చేసుకుంది.
తెల్లవారుజాము నుంచే ఉల్లి కోసం జనం బారులు తీరారు.వారి సంఖ్య ఎక్కువగా ఉండటంతో అధికారులు తగినంత ఉల్లిని అందించలేకపోయారు.
దీంతో వినియోగదారులు వాగ్వాదానికి దిగారు.అయితే ప్రజలు పెద్ద ఎత్తున ఉండటంతో అధికారులు పోలీసుల సహాయం కోరారు.
ముఖ్యంగా మహిళలు పెద్ద సంఖ్యలో ఉండటంతో వారిని నియంత్రించడంలో మహిళా పోలీసులు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది.
శుక్రవారం అధికారులు కేవలం 2100 కిలోల ఉల్లిని మాత్రమే ప్రజలకు అందించారు.
అధికారులు తమకు ఉల్లిని అందించడంలో విఫలమయ్యారంటూ జనం ఉసూరుమంటూ వెనుదిరిగారు.కాగా ఉల్లి అందని వారిని పోలీసులు ఇంటికి తిరిగి పంపించారు.