మన జీవితంలో ఎన్ని ఉన్నా అదృష్టం లేకపోతే కొన్ని పనుల్లో విజయం సాధించలేం.సాధించే సత్తా ఉన్నా సమయం కలిసి రాకపోతే అనుకున్న పనులు అనుకున్న విధంగా జరగవు.
తాజాగా ఒక విద్యార్థి నీట్ పరీక్ష కోసం 700 కిలోమీటర్లు ప్రయాణం చేశాడు.అయితే అంత కష్టపడినా ఆ విద్యార్థికి ఫలితం దక్కలేదు.
నీట్ పరీక్ష కోసం పడిన కష్టం అంతా బూడిదలో పోసిన పన్నీరైంది.పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
సంతోష్ కుమార్ అనే విద్యార్థికి నీట్ పరీక్ష కోసం తను ఉండే ప్రాంతానికి 700 కిలోమీటర్ల దూరంలో పరీక్ష కేంద్రం కేటాయించారు.అయితే పరీక్ష కేంద్రం దూరంగా ఉన్నా పరీక్షలో ఉత్తీర్ణుడు కావాలనే ఆకాంక్షతో బీహార్ లోని ధర్భంగా నుంచి సంతోష్ పశ్చిమ బెంగాల్ లోని సాల్ట్లేక్ ప్రాంతానికి వేర్వేరు బస్సు, ట్యాక్సీలలో ప్రయాణించి చేరుకోవాలనుకున్నాడు.
విద్యార్థి అనుకున్న ప్లాన్ ప్రకారం పరీక్ష జరిగే సమయం కంటే ఆరు గంటల ముందే విద్యార్థి పరీక్ష కేంద్రానికి చేరుకోవాల్సి ఉంది.
అయితే మార్గమధ్యంలో పాట్నా ప్రాంతంలో ఏకంగా ఆరు గంటలు ట్రాఫిక్ జామ్ కావడంతో సంతోష్ పరీక్షా కేంద్రానికి చేరుకునే సరికి 1.40 అయింది.అయితే నీట్ పరీక్షకు 1.30 వరకు మాత్రమే అనుమతి ఉంటుంది.దీంతో అధికారులు విద్యార్థిని పరీక్ష కేంద్రంలోకి అనుమతించలేమని చెప్పారు.
విద్యార్థి ఎంత వేడుకున్నా అధికారుల మనస్సు కరగలేదు.పరీక్ష కేంద్రానికి సమయానికి చేరుకోకపోవడం వల్ల సంవత్సరం వృథా అయిందని విద్యార్థి చెప్పుకొచ్చాడు.
అయితే ఈ విషయం గురించి పరీక్ష కేంద్రం నిర్వాహకులు మాత్రం స్పందించలేదు.పరీక్ష కేంద్రాలు ఇలా నిక్కచ్చిగా డెడ్లైన్ నిబంధన అమలు చేయడంపై గతంలో అనేక సందర్భాల్లో విమర్శలు వ్యక్తమయ్యాయి.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని నిబంధనల్లో మార్పులు చేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.