చైనా వీడియో షేరింగ్ యాప్ టిక్ టాక్ రంగప్రవేశం చేసిన కొన్నాళ్లలోనే సోషల్ మీడియా దిగ్గజాలను సైతం వెనక్కి నెట్టే స్థాయికి చేరింది.అధునాతన ఫీచర్లుతో డౌన్ లోడ్ల సంఖ్య పరంగా టిక్ టాక్ ఆ సమయంలో వరల్డ్ నెంబర్ వన్ అయింది.
ప్రపంచంలో ఎక్కువగా ఆ యాప్ను వినియోగించేవారిలో భారతీయులు సైతం భారీగా వుండేవారు.తమ నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ ఎంతోమంది టిక్టాక్ స్టార్లుగా గుర్తింపు తెచ్చుకుని ఎన్నో అవకాశాలు అందుకున్నారు.
అయితే గల్వాన్ లోయలో భారతీయ సైనికులపై చైనా సైన్యం దాడి చేయడంతో 20 మంది మన జవాన్లు అమరులయ్యారు.దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన కేంద్ర ప్రభుత్వం.
టిక్టాక్ సహా వందలాది చైనా యాప్లను ఇండియాలో బ్యాన్ చేసింది.ఇదే దారిలో మరికొన్ని దేశాలు సైతం నడిచాయి.
అయితే టిక్టాక్కు వున్న ఫాలోయింగ్, బిజినెస్ను దృష్టిలో పెట్టుకుని అమెరికన్ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్.టిక్టాక్ యూఎస్ విభాగాన్ని కొనుగోలు చేయాలని నిర్ణయించింది.అయితే చివరి నిమిషంలో ఆ డీల్ అనూహ్యంగా రద్దయిపోయింది.ఆ డీల్ విఫలమవడంపై తాజాగా మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల స్పందించారు.
తన కెరీర్లో అదే ఓ వింత డీల్ అని అన్నారు.మంగళవారం కాలిఫోర్నియాలోని బివర్లీ హిల్స్ లో నిర్వహించిన కోడ్ కాన్ఫరెన్స్ సందర్భంగా సత్యనాదెళ్ల ఈ వ్యాఖ్యలు చేశారు.
ఒకవేళ డీల్ కనుక కుదిరి వున్నట్లయితే టిక్టాక్లో మైక్రోసాఫ్ట్ సెక్యూరిటీ, పిల్లల భద్రత, క్లౌడ్ నిపుణతను ప్రవేశపెట్టాలనుకున్నానని ఆయన చెప్పారు.అయితే తాము టిక్ టాక్ దగ్గరకు పోలేదని, వారే తమ దగ్గరకు వచ్చారని సత్యనాదెళ్ల వెల్లడించారు.
సంస్థకు నాటి ట్రంప్ ప్రభుత్వం ప్రత్యేకించి కొన్ని విషయాలను స్పష్టం చేసిందని, దురదృష్టవశాత్తూ డీల్ కుదర్లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.మధ్యస్థంగా ఉండే అమెరికా విధి విధానాలు, చైల్డ్ సేఫ్టీ వంటి విషయాలే టిక్ టాక్ మాతృ సంస్థ బైట్ డాన్స్ సీఈవో ఝాంగ్ యిమింగ్ కు నచ్చాయని సత్యనాదెళ్ల పేర్కొన్నారు.
అయితే మైక్రోసాఫ్ట్-టిక్టాక్ డీల్ క్యాన్సిల్ అవ్వడం వెనుక అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చక్రం తిప్పారు.టిక్ టాక్ అమెరికా వెర్షన్ ను బైట్ డాన్స్ నుంచి వేరు చేయాలని ఆయన సూచించారు.
దేశ ప్రజల సమాచార భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్టు ట్రంప్ చెప్పారు.అయితే, దీనిపై నాన్చివేత ధోరణీ కారణంగా 2020 సెప్టెంబర్ నాటికి డీల్ అటకెక్కింది.
ఈ ఏడాది జనవరి నాటికి పూర్తిగా రద్దయిపోయింది.