పవర్స్టార్, ‘జనసేన’ అధినేత పవన్ కళ్యాణ్ ఈ మధ్య ఆంధ్రాలోని రాజధాని నిర్మాణ ప్రాంతంలోని గ్రామాలకు వెళ్లిన సంగతి తెలిసిందే.రాజధాని నిర్మాణం కోసం తమ భూములు ఇవ్వబోమని భీష్మించుకున్నారు పెనుమాక, ఉండవల్లి తదితర గ్రామాల రైతులు.
రైతులు స్వచ్ఛందంగా భూములు ఇవ్వకుంటే భూ సేకరణ చట్టాన్ని ప్రయోగించి భూములు తీసుకుంటామని ప్రభుత్వం చెబుతోంది.ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ రైతులకు మద్దతుగా ఆయా గ్రామాలకు వెళ్లారు.
బలవంతంగా భూములు సేకరించవద్దని ప్రభుత్వాన్ని కోరారు.భూ సేకరణ నోటిఫికేషన్ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
బలవంతంగా భూములు సేకరిస్తే తాను దీక్ష, ధర్నా చేస్తానని కూడా సర్కారును హెచ్చరించారు.ఈ సందర్భంగా పెనమాకలో ఏర్పాటు చేసిన సభలో పవన్ ప్రసంగిస్తున్నప్పుడు గుర్తు తెలియని వ్యక్తి ఆయనపైకి రాయి విసిరాడు.
అయితే అది ఆయనకు తగల్లేదు.పక్కన పడిన రాయిని చేతలో పట్టుకొని పవన్ తన ప్రసంగం కొనసాగించాడు.
ఆ ఘటన గురించి పెద్దగా పట్టించుకోలేదు.కాని ఆ రాయి విసిరిన వ్యక్తి ఎవరో ఇప్పటివరకు తెలియలేదు.
అతను ఏదైనా పార్టీకి చెందినవాడా అనేది కూడా తెలియదు.ఆ వ్యక్తి పవన్ను కొట్టాలనే రాయి విసిరాడా? ఇంకెవరి మీదైనా విసరాలని అనుకున్నాడా? అనే ప్రశ్నలకు జవాబు దొరకలేదు.పవన్పై రాయి విసిరింది ఎవరు? అనే దానిపై సమాజిక మీడియాలో చర్చనీయాంశంగా మారింది.ఇండియాలోనూ, విదేశాల్లో గతంలో నాయకులపై బూట్లు విసిరిన ఘటనలు జరిగాయి.
రాయి విసిరినా, బూటు విసిరినా నిరసన వ్యక్తం చేయడానికే.పవన్పై రాయి విసిరిన వ్యక్తి కోసం పోలీసులు వెదుకుతున్నారట.దొరుకుతాడా?
.