వరంగల్ రాజకీయాల్లో కొండా దంపతులు కొండా మురళి, కొండా సురేఖలది ప్రత్యేక స్థానం.జిల్లా రాజకీయాల్లోనే కాకుండా రాష్ట్రా రాజకీయాల్లోనూ సంచలనం సృష్టించిన జోడీ ఇది.
ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ దంపతులు వరంగల్ రాజకీయ ముఖచిత్రంలో కీలక పాత్రని పోషించారు.కెరీర్ స్టార్టింగ్లో అనేక వివాదాలకు పెట్టింది పేరుగా నిలిచిన కొండా మురళి ఆ తరువాత రాజకీయాల్లోనూ కీలకంగా నిలిచారు.
వైఎస్ హయాంలో ఈ జంట ఓ వెలుగు వెలిగిన కొండా దంపతులు గత కొంత కాలంగా సైలెంట్ అయిపోయారు.
వైఎస్ మరణానంతరం వైఎస్ జగన్కు తెలంగాణ నుంచి అండగా నిలిచిన ఈ జంట జగన్ కోసం మహబూబాబాద్లో తెలంగాణ శ్రేణులపై తుపాకీ గుళ్ల వర్షం కురిపించడానికి కూడా వెనుకాడలేదంటే వైఎస్ పై ఎంతటి అభిమానాన్ని ప్రదర్శించారో అర్థం చేసుకోవచ్చు.
ఆ తరువాత జరిగిన నాటకీయ పరిణామాల నేపథ్యంలో జగన్ని వీడిన కొండా దంపతులు ఆ తరువాత తెరాస తీర్థం పుచ్చుకున్నారు.జిల్లా రాజకీయాల్లోనే కాకుండా రాష్ట్రా రాజకీయాల్లో కొండా సురేఖ ఫైర్ బ్రాండ్గా నిలిచింది.
ఈ జంటకు ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ అభిమానులున్నారు.కొండా సురేఖ గులాబీ బాస్ కేసీఆర్తో విభేదాలు తలెత్తడంతో కాంగ్రెస్ గూటికి చేరి ఓటమి 2018 ముందస్తు ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలయింది.అప్పటి నుంచి రాజకీయ సన్యాసం చేశారా అనేంతగా సైలెంట్ అయిపోయారు.తాజాగా ఈ జోడీ యాక్టివ్ అయినట్టు తెలుస్తోంది.వరంగల్ రాజకీయాల్లో మళ్లీ తమ మార్కుని ప్రదర్శించాలని ఈ జంట పావులు కదుపుతున్నారట.తమ ఉనికిని చాటుకోవడానికి రాబోయే వరంగల్ మేయర్ ఎన్నికలని ప్రధానంగా వాడుకోబోతున్నారని వినికిడి.
గులాబీ అడ్డాగా మారిన వరంగల్ని తిరిగి హస్తగతం చేసుకోవాలన్న కసితో కొండా దంపతులు పంతం పట్టినట్టు టాక్.తూర్పు నియోజకవర్గంలో తమ అనుచరులను కార్పొరేటర్లుగా నిలబెట్టి గెలిపించుకుని సత్తా చాటాలని కసితో ఉన్నారు.
దీంతో వరంగల్లో కాంగ్రెస్ పార్టీకి కొత్త ఊపిరి వచ్చిందని, కార్యకర్తల్లో నూతనోత్సాహం ఉరకలేస్తోందని ప్రచారం మొదలైంది.