టైలర్ కన్హయ్య లాల్ దారుణ హత్యతో ఉలిక్కిపడ్డ ఉదయ్పుర్లో ప్రస్తుతానికి ఉద్రిక్తతలు సద్దుమణిగాయి.కన్హయ్య హత్యను నిరసిస్తూ సర్వ హిందూ సమాజ్ ఉదయ్పుర్లో నిర్వహించిన ర్యాలీ ప్రశాంతంగా ముగిసింది.
అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు.టౌన్ హాల్ నుంచి కలెక్టరేట్ వరకు జరిగిన ఈ ర్యాలీలో పలు హిందూ సంస్థల సభ్యులు సహా వేలాదిమంది పాల్గొన్నారు.
కాషాయ జెండాలను రెపరెపలాడించారు. జై శ్రీరామ్ హిందువుల హత్యలు ఆపండి అంటూ నినాదాలు చేశారు.
నగరంలోని 7 ప్రాంతాల్లో కర్ఫ్యూ ఉన్నప్పటికీ ర్యాలీ కొనసాగే నిర్దేశిత మార్గంలో నిషేధాజ్ఞలు సడలించారు.కన్హయ్య హంతకులకు ఉరిశిక్ష విధించాలంటూ రాష్ట్రపతికి రాసిన విజ్ఞాపన పత్రాన్ని కొంతమంది సాధువులు ఉదయ్పుర్ కలెక్టర్కు అందజేశారు.
బంద్ నేపథ్యంలో నగరమంతటా మార్కెట్లు మూతపడ్డాయి.కన్హయ్య హత్య కేసు నిందితులు మహ్మద్ రియాజ్ , గౌస్ మహ్మద్లను పోలీసులు ఉదయ్పుర్లోని కోర్టులో హాజరుపర్చారు.
కోర్టు వారిద్దరికీ 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది.
ఉదయ్పుర్లో టైలర్ హత్య వెనుక అంతర్జాతీయ స్థాయి కుట్ర ఉందని కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై అన్నారు.ఈ హత్యపై పలు అనుమానాలు వ్యక్తం కావడంతో విచారణను జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ ఐ ఏకు అప్పగించిన విషయం తెలిసిందే.ఈ నేపథ్యంలో బొమ్మై వ్యాఖ్యలు ప్రాధాన్యత కలిగి ఉన్నాయి.
ఇప్పటికే పాకిస్థాన్ కు చెందిన ఉగ్ర సంస్థ దావత్-ఎ-ఇస్లామీతో నిందితుల్లో ఒకరైన గౌస్ మహ్మద్ కు సంబంధాలున్నట్లు రాజస్థాన్ డీజీపీ వెల్లడించారు.
టైలర్ హత్యకు ఉపయోగించిన పదునైన కత్తుల్ని హంతకులు ఎక్కడి నుంచి తెచ్చారన్నదానిపైనా ఎన్ ఐ ఏ దర్యాప్తు జరిపింది.నిందితులిద్దరినీ కత్తులు తయారు చేసినట్టుగా భావిస్తున్న న్యూ ఇండియా ఇంజినీరింగ్ వర్క్స్ ఫ్యాక్టరీకి ఎన్ ఐ ఏ అధికారులు తీసుకెళ్లి అక్కడి పరిసరాలను పరిశీలించారు.మరిన్ని పదునైన కత్తుల్ని కూడా అక్కడే తయారు చేయించి దాచి పెట్టామని నిందితుల నుంచి నిజాలు కక్కించారు.
అంతేకాదు.నిందితులు సోషల్ మీడియాకు విడుదల చేసిన బెదిరింపు వీడియోల్ని కూడా అక్కడే తీసినట్టు ఎన్ ఐ ఏ అధికారులు గుర్తించారు.
మరోవైపు ఈ కేసులో మరో ఇద్దరు నిందితుల్ని కూడా ప్రత్యేక దర్యాప్తు బృందం అరెస్ట్ చేసింది.
.