అమరావతి నుంచి కార్యాలయాల తరలింపుపై రాష్ట్ర హైకోర్టు స్టేటస్ కో పొడిగించింది.ఈ 27వ తేదీ వరకు కార్యాలయాల తరలింపులో యథాతథ స్థితి (స్టేటస్ కో) పాటించాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది.
గతంలో ఇచ్చిన స్టేటస్ కో ముగియడంతో మరోసారి పొడిగిస్తూ హైకోర్టు నిర్ణయం తీసుకుంది.తదుపరి విచారణను ఈ నెల 27కు వాయిదా వేసింది.
పాలనా వికేంద్రీకరణ చట్టం, సీఆర్డీఏ చట్టాన్ని రద్దు చేస్తూ ప్రభుత్వం జారీ చేసిన గెజిట్ ప్రకటనలు, చట్టాలను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై శుక్రవారం త్రిసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది.
కరోనా సమయంలో కార్యాలయాల తరలింపులకు అంత ఎమర్జెన్సీ ఏముందని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది హైకోర్టు.
కాగా, ప్రభుత్వానికి విధులు నిర్వర్తించాల్సిన అవసరముందని ప్రభుత్వం తరపు న్యాయవాది రాకేష్ త్రివేది వాదించారు.కేసును వాయిదాను వేయండి కానీ, స్టేటస్ కో పొడిగించవద్దని హైకోర్టును కోరారు.
స్టేటస్ కో ఉత్తర్వులతో చట్టాలను అమలు చేసే అవకాశం లేకుండా పోయిందని అన్నారు.కాగా, మూడు రాజధానులు అనేవి విభజన చట్టానికి విరుద్ధమని పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టుకు విన్నవించారు.
పిటిషన్లను ప్రత్యక్ష పద్ధతిలో విచారించాలని పిటిషనర్ తరపు న్యాయవాదులు కోరగా.కొవిడ్ వల్ల ప్రత్యక్ష విచారణకు హాజరు కాలేమని సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదులు తెలిపారు.
గతంలో ఇచ్చిన స్టేటస్ కో ఉత్తర్వుల గడువు ఇవాళ్టితో ముగియనుండగా.ఈ నెల 27 వరకు అమలులో ఉంటుందని స్టేటస్ కో పొడిగిస్తున్నట్లు హైకోర్టు స్పష్టం చేసింది.