శ్రీలంక నగరంలో ఏప్రిల్ నెలలో ఈస్టర్ వేడుకల నేపథ్యంలో ఆత్మాహుతి దాడులు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే.ఈ దాడుల్లో 258 మంది ప్రాణాలు కోల్పోగా,పలువురు గాయపడ్డారు.
అయితే ఈ ఘటన నేపథ్యంలో దేశంలో అత్యవసర పరిస్థితి విధించారు లంక అధ్యక్షుడు మైత్రి పాల సిరిసేన.అయితే ఈ రోజు తో ఆ గడువు తేదీ ముగియనున్న నేపథ్యంలో ఈ ఎమర్జెన్సీ ని పొడిగిస్తూ సంచలన నిర్ణయం తీసుకోవడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
కఠిన చట్టాల నుంచి ఉపశమనం కల్పిస్తామని సిరిసేన ఇచ్చిన హామీ ని పక్కకు నెట్టి ఇప్పటికీ దేశంలో అత్యవసర పరిస్థితి ఉన్నట్టు తాను భావిస్తున్నాననీ.ప్రజా భద్రత చట్టం కింద దేశంలో ఎమర్జెన్సీని పొడిగిస్తున్నామని సిరిసేన ప్రకటించడం విశేషం.
పోలీసులు, భద్రతా దళాలకు విశేష అధికారాలు కట్టబెట్టడం సహా పలు కఠిన చట్టాలు ఎమర్జెన్సీ సందర్భంగా అమల్లో ఉంటాయి.అయితే ఈస్టర్ రోజున జరిగిన నరమేథానికి సంబంధించి ఇప్పటి వరకు 100 మందిని మాత్రమే అదుపులోకి తీసుకున్నారు.
ఇందులో 10 మంది మహిళలు కూడా ఉన్నారు.కాగా గత నెలలో అధ్యక్షుడు సిరిసేన పలు దేశాల దౌత్యవేత్తలతో మాట్లాడుతూ శ్రీలంకలో 99 శాతం సాధారణ పరిస్థితి నెలకొందని ఈ నేపధ్యంలో జూన్ 22 నాటికి ఎమర్జెన్సీ చట్టాలను ఎత్తేస్తామని కూడా చెప్పారు.
కానీ ఇప్పుడు పరిస్థితులు మాత్రం పూర్తి భిన్నంగా మారిపోయాయి.అసలు ఎమెర్జెన్సీ ఎత్తివేస్తాను అన్న అధ్యక్షుడు మళ్లీ మనసు ఎందుకు మార్చుకున్నారు అన్న దానిపై ప్రభుత్వ వర్గాల్లోనే ఎలాంటి స్పష్టత లేదు.