తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోన్న శ్రీలంక పరిస్థితి రోజురోజుకూ మరింత దయనీయంగా మారుతోంది.ఈ దేశం తాజాగా ఓ చెడ్డ పేరు తెచ్చుకుంది.
అదేంటంటే శ్రీలంక తీసుకున్న అప్పుకు వడ్డీ చెల్లించడంలో కూడా విఫలమైంది.దీంతో అప్పు ఎగ్గొట్టిన దేశంగా అప్రతిష్టపాలు అవుతోంది.
గడిచిన వందేళ్ల కాలంలో ఒక ఆసియా-పసిఫిక్ దేశం రుణాన్ని ఎగవేయడం ఇదే తొలిసారి అని క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీలు వెల్లడించాయి.శ్రీలంక దేశం రూ.605 కోట్ల రుణ వడ్డీ చెల్లించాల్సి ఉంది.అయితే ఇది 30 రోజుల కిందటే చెల్లించాల్సి ఉంది కానీ శ్రీలంక చెల్లించడంలో విఫలం అయ్యింది.
దీంతో 30 రోజుల గ్రేస్ పీరియడ్ ఆఫర్ చేశారు.ఈ వ్యవధిలో కూడా శ్రీలంక వడ్డీ డబ్బులు చెల్లించలేకపోయింది.
దీంతో శ్రీలంక దివాలా తీసినట్లేనని ఆర్థిక నిపుణులు పేర్కొంటున్నారు.అయితే శ్రీలంక రుణాల ఎగవేతదారుగా మారడంతో దీని కరెన్సీ, ఆర్థిక రంగంపై విశ్వాసం గణనీయంగా తగ్గుతోంది.
ప్రస్తుతం శ్రీలంకలో ఇంధన కొరత యావత్ దేశాన్ని తీవ్ర ఇబ్బందుల్లోకి నెట్టింది.ఇక్కడ ఆహార కొరత కూడా ఎక్కువ అవుతుంది.దీంతో ప్రజలు రాజకీయ నాయకుల పై తీవ్ర విమర్శలు చేస్తున్నారు.దేశవ్యాప్తంగా నిరసనలు కూడా జరుగుతున్నాయి.
గ్యాస్, ఇంధన, ఆహార కొరతలను తీర్చాలని లంకేయులు రాజకీయ నేతలను ఒత్తిడి చేస్తున్నారు.అయితే శ్రీలంక దేశాన్ని రుణభారం నుంచి గట్టెక్కిస్తామని జీ-7 దేశాలు ప్రకటించాయి.
ఈ ప్రకటనను ఆ దేశ ప్రధానమంత్రి రణిల్ విక్రమ సింగే స్వాగతించారు.అయితే జపాన్ దేశం శుక్రవారంనాడు శ్రీలంకకు రూ.11.64 కోట్లను ఆర్థిక సహాయంగా అందజేసింది.అయితే ఈ సంక్షోభం నుంచి శ్రీలంక దేశం ఎలా బయటపడుతుందో చూడాలి.