నిజ జీవితంలోనే కాకుండా సినిమాలలో కూడా వాన పడితే ఆ సన్నివేశంలోని ఎమోషనే మారిపోతుంది.వానలో ప్రేమ, వాదన,సంఘర్షణ బలం ప్రేక్షకుణ్ణి తాకుతాయి.
మరి ఇప్పటివరకు విడుదల అయిన ఆసినిమాలు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం.జపనీస్ దర్శకుడు అకిరా కురసావా తీసిన రోషమాన్ సినిమా ప్రారంభంలోనే రోషమాన్ నగర శిథిల ద్వారం దగ్గర హోరుమని కురిసే వర్షాన్ని చూపుతాడు దర్శకుడు.ఆ శిథిల ద్వారం, ఆ క్రూర వర్షం 12వ శతాబ్దపు జపనీయ స్థితిగతులకు సంకేతం.1950లో తీసిన ఈ సినిమాకు ముందు వానను అలా చూపినవారు లేరు.సినిమాలో ఈ సన్నివేశం తీస్తున్నప్పుడు ముందు కురుస్తున్న వానే తప్ప వెనుక కొండల మీదుగా కురుస్తున్న వాన కెమెరాలో రిజిస్టర్ కావడం లేదని కురసావా గమనించి వాన ముందు కురిసి వెనుక కురియకపోతే సహజత్వం ఉండని ఆలోచించి వెనుక కురిసే వానలో కొంచెం నల్ల ఇంకును కలిపారు.
రెయిన్ మిషన్లతో కృత్రిమంగా సృష్టించిన ఈ వాన అందువల్ల అత్యంత సహజంగా ఉంటుంది.
ఈ సినిమా తరువాత సింగింగ్ ఇన్ ది రెయిన్ లో నటుడు జీన్ కెల్లి తన స్వీయ దర్శకత్వంలో, స్వీయ కొరియోగ్రఫీలో పాడిన సింగింగ్ ఇన్ ద రెయిన్ పాట చరిత్ర సృష్టించింది.ప్రియురాలికి ముద్దు పెట్టి గుడ్నైట్ చెప్పాక ఆ పారవశ్యంతో బయటికొస్తే వాన కురుస్తుంటుంది.
టాక్సీని వద్దని అతడు వానలో ఆనంద తాండవం చేస్తాడు.ఆ తరువాత 1955లో ఇదే మ్యాజిక్ ని దర్శకుడు రాజ్ కపూర్ శ్రీ 420 లో సాధించాడు.
ఆ సినిమాలో భారతీయ తెర మీద ఇప్పటికీ పునరావృత్తం కానంత అందంగా ప్యార్ హువా ఇక్రార్ హువా హై పాటను చిత్రీకరణ చేశారు.
హీరో రాజ్ కపూర్, హీరోయిన్ నర్గీస్ అంతవరకూ స్నేహంలో ఉండి ఆ క్షణంలో ఒకరి పై మరొకరికి ప్రేమ ఉన్నట్టు గ్రహిస్తారు.తెలుగులో 1961లో వచ్చిన ఆత్మ బలంలో చిటపట చినుకులు పడుతూ ఉంటే పాటను మనోహరంగా చిత్రీకరించిన దర్శకుడు విక్టరీ మధుసూదనరావుకు పేరు రావాల్సిందేగానీ నిజానికి ఆ పేరుకు వారసుడు ఆయన కాదు.ఎందుకంటే అక్కడ వాన పాట ఉండాలని అనుకోలేదు.
ఆత్రేయ బెంగళూరులో పాట రాయడానికి వెళ్లి పల్లవి తోచక తిరుగుతూ అప్పుడే మొదలైన వానను చూసి రాయగా అక్కినేని కంటే బి.సరోజా ఎక్కువ మార్కులు కొట్టేసిన పాట ఇది.ఇక సినిమాలలో వాన సన్నివేశాలు, పాటలు తీయడం కష్టం.కారణం అందుకు చాలా ఖర్చవుతుంది.
నటీనటులు పదేపదే తడవాలి.కొందరు ఒప్పుకోరు.
నీటి సమస్య.ఇవన్నీ ఉంటాయి.
అయినప్పటికీ కొందరు దర్శకులు పట్టుబట్టి వానను సినిమాల్లోకి తెచ్చారు.
బలిపీఠం సినిమాలో క్లయిమాక్స్ అంతా భీకరమైన గాలివానలో జరిగినట్టు చూపి ఉత్కంఠ కలిగిస్తాడు దర్శకుడు దాసరి నారాయణ రావు.శంకరాభరణం సినిమాలో అవమానం పొందిన శంకరశాస్త్రి దానిని శంకరా నాదశరీరాపరా అని శివుడితో చెప్పుకుంటాడు.అంతటితో ఎఫెక్ట్ రాదు.
ఆ ఆలయం మీద హోరున కురిసే వానలో ప్రాథేయ నృత్యం చేస్తాడు శంకర శాస్త్రి.గొప్ప ఎమోషన్ కలుగుతుంది.
దర్శకుడు మణిరత్నం ‘గీతాంజలి’ సినిమాలో గిరిజ నాగార్జునను నిలదీసే సన్నివేశానికి వానను వాడుకున్నాడు.ఆ తరువాత మనసంతా నువ్వేలో వానను ఒక సన్నివేశంలో అద్భుతంగా ఉపయోగించుకున్నాడు దర్శకుడు వి.ఎన్.ఆదిత్య.
ప్రేమ సఫలమయ్యే వేళకు అది విఫలం అయ్యే ఘడియ రావడంతో ఉక్కిరిబిక్కిరి అవుతాడు ఉదయ్ కిరణ్.
బయటకు చెప్పుకోలేడు.స్నేహితుడు సునీల్ ఆ క్షణంలో కుండపోత కురియడం చూసి ఏడవరా ఈ వానలో నీ ఏడుపును దాచుకో’ అంటాడు.అజిత్ నటించిన ప్రేమలేఖ సినిమాలో క్లయిమాక్స్ అంతా వానలో తీయడం దర్శకుడు అగస్త్యన్కు పేరు తెచ్చింది.
ఇక ఇటీవల విడుదలైన విరాట పర్వం సినిమాలో దర్శకుడు వేణు ఉడుగుల వానను చాలా సమర్థంగా ఉపయోగించాడు.నక్సలైట్ రవన్నను వెతుక్కుంటూ వెన్నెల పాత్రధారి సాయి పల్లవి భోరున కురిసే వానలో పౌరహక్కుల నాయకురాలు నందితా దాస్ ఇంటికి వెళ్లడం ప్రేక్షకులను కూడా తడిసి ముద్దయిన భావనను కలిగిస్తుంది.
అలాగే ‘పలాస’ సినిమాలో దర్శకుడు కరుణ కుమార్ వానను ఎమోషన్ కోసం కీలక సన్నివేశాలలో ఉపయోగించాడు.